కరోనా: పోలీస్ శాఖ సంచలన నిర్ణయం.. దేశం ముంగిట అతిపెద్ద సవాలు.. లాక్డౌన్ ఎత్తేసినా తిప్పలే..
కొవిడ్-19 రోగుల సంఖ్య గ్లోబల్ గా 30లక్షలు దాటగా, భారత్ లో 30వేలకు చేరువైంది. మొత్తం మరణాలు 2.12లక్షలు కాగా, మన దగ్గర ఆ సంఖ్య 1000కి పెరిగింది. ఇప్పటిదాకా కరోనా కాటుకు బలైపోయిన వాళ్లలో 70 శాతానికిపైగా పెద్ద వయసు వాళ్లున్నారు. కరోనా వైరస్ విజృంభణ మొదలైనప్పటి నుంచీ వయసు పైబడినవాళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. స్పెయిన్ లాంటి దేశాల్లోనైతే ఒక దశలో 'ముసలోళ్లు చస్తే చచ్చారు'అని వదిలేసినట్లు వార్తలు వచ్చాయి. ''ఇంట్లో పెద్దవాళ్లను జాగ్రత్తగా కాపాడుకోండి, వాళ్లను బయటికి రానీయకండి''అంటూ మన ప్రభుత్వాలు కూడా పదే పదే హెచ్చరిస్తున్నాయి. ఈక్రమంలో మహారాష్ట్ర పోలీసు శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది.
55 దాటితే నో డ్యూటీ..
కరోనా వైరస్ కు సంబంధించి మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రంగా కొనసాగుతోన్న మహారాష్ట్రలో కేసుల సఖ్య తొమ్మిది వేలకు చేరువైంది. ఇప్పటికే 370 మంది ప్రాణాలు కోల్పోయారు. అన్ని ప్రాంతాల మాదిరే అక్కడ చనిపోయినవాళ్లలోనూ ఎక్కువ మంది పెద్ద వయసువాళ్లే. అందులో ముగ్గురు పోలీసులు కూడా ఉన్నారు. లాక్ డౌన్ డ్యూటీ చేస్తుండగా కరోనా సోకి, మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు పోలీసులు చనిపోయారు. వాళ్లలో ఇద్దరి వయసు 57 ఏళ్లుకాగా, మరొకరికి 52 ఏళ్లు. విస్తృత సంప్రదింపులు జరిపిన తర్వాత 55 ఏళ్లు పైబడిన పోలీసులెవరూ డ్యూటీలకు రావొద్దని పోలీసు శాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
రక్షక భటులకు రక్షణ లేకే..
దేశంలో లాక్ డౌన్ అమలును గ్రౌడ్ లెవల్ లో నిర్వహిస్తున్నది పోలీసులేనన్న సంగతి తెలిసిందే. ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ దురదృష్టవశాత్తూ ఆ శాఖ సిబ్బంది ఇన్ఫెక్షన్ కు గురవుతున్నారు. ముంబై సిటీలోనైతే ఏకంగా 20 మంది ఉన్నతాధికారులతోపాటు మొత్తం 107 మంది పోలీసులకు వైరస్ సోకింది. అందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో రిస్క్ వద్దనే ఉద్దేశంతోనే 55 ఏళ్లు పైబడిన పోలీసులను సెలవుపై పంపుతున్నామని ముంబై కమిషనర్ తెలిపారు. అంతేకాదు, 50 నుంచి 55 ఏళ్ల వారికి ఫీల్డ్ డ్యూటీల నుంచి మినహాయింపు ఇచ్చినట్లు చెప్పారు.
మిగతా శాఖల మాటేంటి?
55 ఏళ్లు పైబడిన పోలీసుల్ని సెలవుపై పంపుతూ ముంబై శాఖ తీసుకున్న నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశమైంది. ముంబై సహా దేశంలోని చాలా ప్రాంతాల్లో కరోనా కాటుకు గురవుతోన్నవాళ్లలో పారిశుద్ధ్య కార్మికులు, ఇతర శాఖల ఉద్యోగుల సంఖ్య కూడా తక్కువేమీలేదు. ఇప్పటికైతే కచ్చితమైన సమాచారం లేదుగానీ, ఎమర్జెన్సీ సర్వీసులు నిర్వహిస్తోన్న అన్ని శాఖలు కూడా వయసుపైబడిన ఉద్యోగుల విషయంలో ఇదే తరహా నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదు.
Recommended Video
లాక్ డౌన్ తర్వాతా సవాలే..
కరోనా వైరస్ కు బలైపోతున్నవాళ్లలో పెద్దవయసువాళ్లు, వేరే రోగాలతో బాధపడుతోన్న వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రస్తుతం 50 ఏళ్లు పైబడినవాళ్లలో చాలా మంది ఏదోరకమైన ఇబ్బందులు ఎదుర్కంటున్నవాళ్లే. కరోనా చాపకింద నీరులా విస్తరిస్తున్న వేళ, లాక్ డౌన్ ఎత్తేస్తే ఈ కేటగిరీని కాపాడుకోవడం సవాలుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. కరోనాకు ఇంకా మందు అందుబాటులోకి రానివేళ.. ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెంపొందించడం (హెర్డ్ ఇమ్యూనిటీ) ఒక్కటే మార్గమనే చర్చ విస్తృతంగా సాగుతున్నది. రోగాలతో బాధపడే పెద్దల విషయంలో ప్రభుత్వాలు తీసుకోబో నిర్ణయాలు కీలకం కానున్నాయి.