అనూహ్య కేసులో 'ఆధార్', అక్కడ 3వేల ఫోన్ కాల్స్
ముంబై/విజయవాడ: సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూహ్య హత్య కేసు దర్యాప్తులో ముంబైలోని ప్రభుత్వ రైల్వే పోలీసు (జిఆర్పీ) విభాగం సరికొత్త పంథాను అనుసరిస్తోంది. దేశంలోనే తొలిసారిగా విశిష్ట గుర్తింపు సంఖ్య 'ఆధార్' ఆలంబనగా విచారణను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ముంబై శివార్లలో అనుమానాస్పద పరిస్థితుల నడుమ సగం కాలిన అనూహ్య మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే.
ఈ కేసులో సమాంతర దర్యాప్తు సాగిస్తున్న జిఆర్పీ, ముంబై పోలీసులతో కలసి కొత్త బాటలో ముందడుగు వేసింది. ఇందులో భాగంగా నగరంలోని ఆధార్ నమోదు కేంద్రాల నుంచి సమాచారం కోరినట్లు కుర్లా రైల్వే స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ శివాజీ ధుమాల్ చెప్పారు. జనవరి 5 తెల్లవారుజామున 4:45 నుంచి ఉదయం 6:00 గంటల మధ్య ఆమె చేసిన, అందుకున్న కాల్స్ జాబితాను సెల్ ఫోన్ కంపెనీల నుంచి కోరారు. ఆయా ఫోన్ నంబర్లను ఆధార్ సమాచార నిధికి జోడించి, వాటి సొంతదారులెవరో కూపీ లాగనున్నారు.
కాగా, అనూహ్య హత్య కేసును వీలైనంత త్వరగా చేధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. లోకమాన్య తిలక్ టెర్మినల్లో అనూహ్య రైలు దిగిన రోజు తెల్లవారు జామున నాలుగు గంటల నుండి ఆరు గంటల వ్యవధిలో కుర్లా సెల్ టవర్ పరిధిలో నమోదైన కాల్సును పరిశీలించారు. ఇవి సుమారు మూడవేల దాకా ఉన్నట్లు తేలింది. వీటి ఆధారంగా దర్యాఫ్తులో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నదని భావిస్తున్నారు. అనూహ్య కేసులో అనుమానిత వ్యక్తి ఫోటోను ముంబై పోలీసులు మూడు ప్రాంతీ ట్రాన్సుఫోర్ట్ కార్యాలయాలకు పంపించారు.
మరోవైపు అనూహ్య హత్యకు నిరసనగా బుధవారం జరిగిన బందరు బంద్ విజయవంతమైంది. దళిత జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈ బంద్ జరిగింది. దళిత క్రైస్తవ సంఘాలతో పాటు అఖిలపక్షం నాయకులు పాల్గొని నిరసన ప్రదర్శనలు చేశారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఆంధ్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఆర్టీసీ బస్సు సర్వీసులు తిరగలేదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన బస్సులు బందరు ఊరుబయట నుంచే రాకపోకలు సాగించాయి.
విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్కు స్వచ్చందంగా సహకరించాయి. సినిమా హాళ్ళు, హోటళ్ళు, బ్యాం కులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పెట్రోలు బంకులు బంద్ కారణంగా మూతపడ్డాయి. ఆర్టీసీ సర్వీసులు రద్దవడం వల్ల ప్రయాణీకులు రైళ్ళు, ఆటోలను ఆశ్రయించారు.