పెళ్లిలో డబ్బు దర్పం చూపించారు.. కాలుష్యాన్ని మిగిల్చారు.. కేసుల్లో ఇరుక్కున్నారు..
ఔలీ : కోటీశ్వరుల ఇళ్లలో పెళ్లంటే మాటలు కావు.. ఆకాశమంత పందరి భూదేవంత అరుగువేసి రేంజ్కు తగ్గట్లు ఖర్చు పెట్టి ఆడంబరంగా చేస్తారు. ఉత్తరాఖండ్ ఔలీలో ఈ మధ్య ఇలాంటి వివాహమే జరిగింది. అపర కుబేరుల ఇంట్లో జరిగిన పెళ్లి అక్కడి మున్సిపల్ అధికారులు తలనొప్పి తెచ్చిపెట్టింది. పెళ్లి కారణంగా ఔలీలో భారీ మొత్తంలో చెత్త పేరుకుపోవడంతో దాన్ని శుభ్రం చేసేందుకు సిబ్బంది నానా కష్టాలు పడుతున్నారు.
అంగరంగ వైభవంగా వివాహం
భారత్కు చెందిన గుప్తా కుటుంబం కొన్ని దశాబ్దాల క్రితం దక్షిణాఫ్రికాలో స్థిరపడింది. వివిధ వ్యాపారాలు చేస్తూ కోట్లకు పడగలెత్తారు. ఇటీవల గుప్తా కుటుంబానికి చెందిన అజయ్ గుప్తా కుమారుడు సూర్యకాంత్, అజయ్ సోదరుడు అతుల్ గుప్తా కొడుకు శశాంక్ వివాహం జరిగాయి. ఉత్తరాఖండ్లో ఓలి ప్రాంతంలో జరిగిన ఈ పెళ్లికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. పెళ్లి కోసం ఔలీలోని రిసార్టులన్నీ బుక్ చేసుకున్న గుప్తా కుటుంబం దాదాపు రూ.200 కోట్లతో అంగరంగ వైభవంగా వివాహం జరిపించింది.
40 క్వింటాళ్ల చెత్త
40 క్వింటాళ్ల చెత్తపెళ్లి ముగిసి ఎక్కడివారు ఎక్కడికి వెళ్లిపోయాక ఔలీలో కనిపించిన దృశ్యం చూసి మున్సిపల్ అధికారులు షాకయ్యారు. ప్రకృతి సౌందర్యానికి ఆలవాలమైన ఔలీలో ప్రస్తుతం ఎక్కడ చూసిన చెత్తే కనిపిస్తోంది. ప్లాస్టిక్ కవర్లు, తాగి పడేసిన వాటర్ బాటిళ్లు ఇతర చెత్త కలిపి దాదాపు 40క్వింటాళ్ల వరకు పోగైనట్లు అధికారులు గుర్తించారు. దాన్ని శుభ్రం చేసేందుకు దాదాపు 20 మంది శ్రమిస్తున్నారు. స్థానికుల పాడి పశువులు గడ్డి మేసేందుకు ఆ ప్రాంతాలకు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ తిని వాటి ఆరోగ్యం పాడయ్యే ప్రమాదం ఉండటంతో వీలైనంత తొందరగా చెత్త తొలగించేందుకు శ్రమిస్తున్నారు.
గుప్తాలపై కోర్టులో పిటీషన్
గుప్తాల వివాహ వేడుకలపై కోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ వేడుకల కారణంగా ఔలీలో పర్యావరణానికి హాని కలుగుతుందని పిటీషనర్లు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. మరోవైపు గుప్తా పెళ్లి వేడుకలపై వస్తున్న ఆరోపణలను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ కొట్టి పారేశారు. ఈ పెళ్లి కారణంగా ఔలీ పర్యాటక ప్రాంతంగా మారిందని ఆయన చెప్పడం కొసమెరుపు.