క్యాన్సర్తో కేంద్ర మాజీ మంత్రి మురళీ దేవరా మృతి
ముంబై: కాంగ్రెసు సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మురళీ దేవరా (77) క్యాన్సర్ వ్యాధితో కన్నుమూశారు. ఆయన సోమవారం తెల్లవారు జామున గం.3.25 నిమిషాలకు ముంబైలో తుది శ్వాస విడిచారు. ఆయన కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ముంబైలో జన్మించిన దేవరా రాజస్థాన్ కుటుంబానికి చెందినవారు.
పారిశ్రామిక కటుంబంలో జన్మించిన దేవరా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ రాజకీయాల్లోకి వచ్చారు. ముంబై మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ద్వారా రాజకీయాల్లో ప్రవేశించారు. ముంబై కాంగ్రెసు అధ్యక్షుడిగా 22 ఏళ్ల పాటు పనిచేశారు. 2006లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో యుపిఎ హయాంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా మురళీ దేవరా పనిచేశారు. పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిగా ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలు రావడంతో పదవి నుంచి తప్పుకున్నారు.
ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సందర్శకుల కోసం మురళీ దేవరా భౌతిక కాయాన్ని మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ముంబైలోని కాంగ్రెసు కార్యాలయంలో ఉంచుతారు. ఆయన అంత్యక్రియలు సోమవారం సాయంత్రం చందన్వాడీ శ్మశానవాటిలో జరుగుతాయి. ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రుడైన దేవరా 1977 నుంచి 1978 మధ్య కాలంలో ముంబై మేయర్గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన నాలుగు సార్లు ముంబై సౌత్ నుంచి లోకసభకు ఎన్నికయ్యారు.
ఆ తర్వాత ముంబై సౌత్ నుంచి ఆయన కుమారుడు మిలింద్ దేవరా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన మూడోసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్ారు. 2011 జులైలో ఆయన కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు.