శ్రోతలకు గమనిక: గానం బాలు-చిత్ర - సంగీతం మునుపటిలా ఉండదు - సావిత్రమ్మకు సానుభూతి..
శ్రోతల కోరిక మేరకు ఇప్పుడు 'జగదేకవీరుడు-అతిలోక సుందరి' చిత్రం నుంచి 'అబ్బనీ తియ్యనీ దెబ్బ' పాట వింటారు. సంగీతం ఇళయరాజ.. రచన వేటూరి.. గానం.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం-చిత్ర.. ఈ ఒక్కపాటే కాదు.. 90వ దశకం కంటే ముందు పుట్టినవాళ్లందరికీ ఈ తరహా రేడియో అనౌన్స్మెంట్లు.. 'బాలు-చిత్ర జోడి' అనే పదాలు ఇప్పటికీ చెవుల్లో రింగుమంటాయంటే అతిశయోక్తికాదు..
అంతటి గాన గంధర్వుడికే గొంతు అరువు - ఎస్పీ బాలు లైఫ్లో అరుదైన ఘటన - సుఖ్విందర్ ఎంత లక్కీ!
సర్వం బాలు-చిత్ర మయం..
వయసురీత్యా సుశీలమ్మ విశ్రాంతి తీసుకుంటోన్న తరుణంలో ఫిమేల్ ప్లేబ్యాక్ భారమంతా ఎస్.జానకి ఒక్కరే మోస్తున్న సమయంలో ఔత్సాహిక గాయనిగా కేఎస్ చిత్ర సినీపరిశ్రలోకి అడుగుపెట్టారు. మధురమైన స్వరంతో అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకున్న చిత్ర.. బాలుతో కలిసి వేలకొద్దీ డ్యూయెట్లు ఆలపించారు. 80వ దశకం చివర నుంచి మిలీనియం ప్రారంభం దాకా.. దాదాపు 20 ఏళ్లపాటు ఏ రేడియో ప్రకటన విన్నా, ఏ ఆడియో క్యాసెట్ మీద చూసి ‘గానం: బాలు, చిత్ర'అని కనిపించేది.
సర్వనాశనం : ఏఆర్ రెహమాన్ ఉద్వేగం - కొత్త తరం ఎస్పీ బాలను కించపర్చిందా?
బాలు లేని సంగీతం ఎలా ఉంటుంది?
కచ్చితంగా మునుపటిలా మాత్రం ఉండబోదంటున్నారు కేఎస్ చిత్ర. బాలుతో కలిసి సుదీర్ఘంగా సాగిన తన పాటల ప్రయాణంలో ఈ మార్పును జీర్ణించుకోలేకపోతున్నానని ఆమె చెప్పారు. బాలు మృతి పట్ల భావోద్వేగంగా ప్రకటన చేశారు. ‘‘ఒక శకం ముగిసింది. సంగీతం మునుపటిలా ఉండబోదు. అంతేకాదు, ఈ ప్రపంచం కూడా ఇదివరకటిలా ఉండదు. ఒక మంచి గాయనిగా ఎదిగేందుకు నాకు మార్గనిర్దేశనం చేసిన బాలు గారికి ధన్యవాదాలు చెప్పాలంటే మాటలు సరిపోవు..'' అని చిత్ర ట్వీట్ చేశారు.
సావిత్రమ్మను తలుచుకుంటూ..
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. కరోనాతో బాధపడుతూ 50 రోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన.. అభిమానుల్ని శోకసంద్రంలో ముంచేసి పైలోకాలకు వెళ్లిపోయారు. బాలు సమక్షంలో ఇకపై సంగీత ప్రదర్శనలు ఉండబోవు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా అని కేఎస్ చిత్ర అన్నారు. ఈ సందర్భంగా బాలు భార్య సావిత్రమ్మను తలుచుకుంటున్నానని, బాలు తనయుడు చరణ్, తనయ పల్లవి, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చిత్ర పేర్కొన్నారు.