యూపీలో దారుణం: ముస్లిం రిక్షావాలాపై మూక దాడి-కొట్టొద్దని కూతురు వేడుకున్నా...
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో దారుణం జరిగింది. 45 ఏళ్ల ఓ ముస్లిం రిక్షావాలాపై కొంతమంది మూక దాడికి పాల్పడ్డారు. 'జై శ్రీరామ్' నినాదాలు చేయాలని అతన్ని వీధుల్లో ఊరేగిస్తూ విపరీతంగా కొట్టారు. అతనితో పాటే ఉన్న అతని కుమార్తె తన తండ్రిని కొట్టవద్దని ఆ మూకను ఎంతగా బతిమాలినా వారు వినిపించుకోలేదు. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో అతన్ని విడిచిపెట్టారు.పోలీసులు అతన్ని జీపులో ఎక్కిస్తున్న సమయంలోనూ ఆ మూక పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ దాడికి పాల్పడింది. స్థానికులు ఈ దాడి వీడియోను తమ సెల్ఫోన్లలో చిత్రీకరించగా... ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అసలేం జరిగింది...
కాన్పూర్లోని ఓ ప్రాంతంలో బుధవారం(ఆగస్టు 10) భజరంగదళ్ సంస్థ ఓ సమావేశం నిర్వహించింది. ఆ ప్రాంతంలోని ముస్లింలు హిందూ అమ్మాయిలను ముస్లిం మతంలోకి మారుస్తున్నారంటూ కొంతమంది భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆ సమావేశంలో పేర్కొన్నారు. ఆ సమావేశం ముగిసిన కొద్దిసేపటికే... అక్కడికి 500మీటర్ల దూరంలో 45 ఏళ్ల ముస్లిం వ్యక్తిపై దాడి జరిగింది. దాడిపై బాధితుడు మాట్లాడుతూ... మధ్యాహ్నం 3గం. సమయంలో నేను రిక్షా తొక్కుతుండగా.. కొంతమంది వ్యక్తులు నాపై దాడికి పాల్పడ్డారు. నన్ను,నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు. పోలీసులు రావడంతో నేను బతికిపోయాను.' అని తెలిపాడు.

పోలీసులు ఏమంటున్నారు...
కాన్పూర్ పోలీసులు ఈ ఘటనపై మాట్లాడుతూ... అతనిపై దాడికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. స్థానికంగా మ్యారేజ్ బ్యాండ్ నిర్వహించే ఓ వ్యక్తితో పాటు అతని కొడుకు,మరో 10 మందిపై కేసు నమోదు చేశామన్నారు. బాధితుడి బంధువులతో ఉన్న గొడవల కారణంగా అతనిపై దాడికి పాల్పడి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుడి బంధువులకు,ఓ హిందు కుటుంబానికి మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గత జులైలో ఇరువురు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఆ పగతోనే దాడి చేశారా?
ఇదే క్రమంలో ఇటీవల ఈ వ్యవహారంలో భజరంగ్ దళ్ తలదూర్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఓ హిందు యువతిని బలవంతంగా మతమార్పిడి చేశారని ఆ ముస్లిం కుటుంబంపై భజరంగ్ దళ్ సభ్యులు ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ కుటుంబంపై ఉన్న పగతోనే వారి బంధువైన వ్యక్తిపై దాడికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు మాత్రం దాడికి పాల్పడినవారు పలానా సంస్థకు చెందినవారిగా ఎక్కడా వెల్లడించలేదు. కాన్పూర్ సీనియర్ పోలీస్ అధికారి రవీనా త్యాగి మాట్లాడుతూ... ఆ వ్యక్తిపై దాడికి పాల్పడిన వీడియో తమ దృష్టికి వచ్చిందన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications