గెలుపోటముల్లో ముస్లింలే కీలకం.. దక్కుతున్నది అంతంతమాత్రం ప్రాధాన్యం
ఢిల్లీ : భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం సొంతం. ఎన్నో మతాలు, కులాలు కలిగిన దేశంలో ప్రతి ఒక్కరికీ సమ ప్రాధాన్యం ఉంది. పేరుకు మైనార్టీలు అయినా ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. 130 కోట్ల జనాభా కలిగిన దేశంలో 18కోట్లకు పైగా ఉన్న ముస్లింలు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను వారే నిర్దేశించనున్నారు. దేశవ్యాప్తంగా 218 నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లే కీలకం కానున్నాయి.
ఏడు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ముస్లింలు
2011 జనాభా లెక్కల ప్రకారం ఏడు రాష్ట్రాల్లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉంది. లక్షద్వీప్ లో 96.58శాతం ముస్లింలు ఉండగా.. జమ్ము కాశ్మీర్ లో 68.31, అసోంలో 34.22, బెంగాల్ లో 27.01, కేరళలో 26.56, ఉత్తర్ ప్రదేశ్ లో 19.26, బీహార్ లో 16.87, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 9.56శాతం మంది ముస్లింలు ఉన్నారు. ఈ లెక్కలను బట్టి చూస్తే దేశంలో 145 నియోజకవర్గాల్లో 20శాతం ముస్లిం ఓట్లు ఉండగా.. 38 స్థానాల్లో 30శాతానికి పైగా, 35 స్థానాల్లో మూడో వంతు ముస్లిం సామాజికవర్గ ఓటర్లు ఉన్నారు. ఈ కారణంగానే ఏ ఎన్నికలు వచ్చినా రాజకీయ పార్టీలు వారిని ఆకట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటాయి.
అంతుచిక్కని ముస్లిం ఓటర్ల నాడి
దేశంలో 20శాతం ఉన్న ముస్లింల మద్దతు ఎవరికన్నది అంతుచిక్కని రహస్యమే. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఇందుకు నిదర్శనం. అప్పట్లో అక్కడి ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారన్న వార్తలు వచ్చినా ఆ పార్టీ మాత్రం మూడింట రెండొంతుల మెజార్టీ సాధించి విజయ ఢంకా మోగించింది.
ఓట్ల చీలిక.. గెలుపోటములపై ప్రభావం
దేశంలో చాలా నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లే గెలుపోటములు నిర్దేశిస్తారు. 80 లోక్ సభ స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్ లో 16 నియోజకవర్గాల్లో 20 నుంచి 50శాతం మంది ముస్లింలు ఉన్నారంటే ఎన్నికల్లో వారి ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు. యూపీలోని రాంపూర్ లోక్ సభ నియోజకవర్గంలో 50శాతం, మొరాదాబాద్ లో 41, సహారన్ పూర్ 39, బిజ్నౌర్ 39, అమ్రొహా 38, మేరఠ్ 31, కైరానా 38, బరేలీ 29, ముజఫర్ నగర్ 28, సంభాల్ 28, దుమారియాగంజ్ 27, బహ్రెయిచ్ 23, కైసర్ గంజ్ 23, లఖ్ నవూ 23, షాజహాన్ పూర్ 21, బారాబంకీలో 21శాతం మంది ముస్లింలు ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో ఈ నియోజక వర్గాల నుంచి ఏ ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా విజయం సాధించకపోవడం విశేషం. ఇందుకు ప్రధాన కారణం ముస్లిం ఓట్లు చీలిపోవడమే. వెస్ట్ యూపీలోని ముస్లిం ప్రభావిత ప్రాంతమైన సంభాల్ లో బీజేపీ అభ్యర్థి కేవలం 5వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అక్కడ బీజేపీకి 34.8శాతం ఓట్లు రాగా.. ఎస్పీకి 34 శాతం ఓట్లు, బీఎస్పీకి 24 శాతం ఓట్లు వచ్చాయి. అప్పట్లో ఎస్పీ, బీఎస్పీలు ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలిపి ఉంటే ఓట్ల చీలిక ఉండేది కాదన్నది రాజకీయ విశ్లేషకుల మాట.
ఎన్నికల స్టంటే : ఆ ఘనత మీది కాదు ..? టెలిగ్రాఫ్ రిపోర్టర్దేనన్న విపక్షాలు
ఓట్ల చీలికపై బీజేపీ ఆశలు
50 శాతానికి పైగా ముస్లిం జనాభా కలిగిన రాంపూర్ లో బీజేపీ ఓట్ల చీలక వల్లే లబ్ది పొందింది. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లోనూ ముస్లిం ఓట్లు చీలిక తమకు కలిసొస్తుందని బీజేపీ ఆశపడింది. అయితే ఉత్తర్ ప్రదేశ్ లో ఎస్పీ, బీఎస్పీ జట్టు కట్టడం, బీహార్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కూటమిగా ఏర్పడటం కమలనాథుల ఆశలపై నీళ్లు చల్లాయి.
చట్టసభల్లో ప్రాతినిధ్యం అంతంతమాత్రం
దేశంలో ముస్లిం ఓటర్లు కీలకమైనప్పటికీ చట్టసభల్లో మాత్రం వారికి చెప్పుకోదగ్గ రీతిలో ప్రాతినిధ్యం లభించడం లేదు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 1980లో అత్యధికంగా 49 మంది ముస్లింలు లోక్ సభకు ఎన్నికయ్యారు తప్ప ఆ తర్వాత ఏనాడూ వారికి ఆ స్థాయిలో ప్రాతినిధ్యం దక్కలేదు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కేవలం 24 మంది ముస్లిం అభ్యర్థులు మాత్రమే లోక్ సభలో అడుగుపెట్టారు. మొత్తం ఎంపీల సంఖ్యలో ఇది కేవలం 5శాతం మాత్రమే కావడం గమనార్హం. గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 38శాతం, బీజేపీకి 8.5, లెఫ్ట్ పార్టీలకు 6.4, సమాజ్ వాదీ పార్టీకి 11.2శాతం మంది ముస్లింలు ఓటు వేశారు.