దీదీ దీదే: మేం ఢిల్లీ రాం, ముగ్గురిపై ఎఫ్ఐఆర్, ఏడుగురి అరెస్ట్.. హోంశాఖ సమన్లకు సీఎస్ లేఖ..
కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వడంలో ఫైర్ బ్రాండ్ దీదీ మమతా బెనర్జీ తర్వాతే ఎవరైనా.. కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ అధ్యక్షుడు కారుపై దాడితో టీఎంసీ-బీజేపీ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. దీంతో కేంద్ర హోంశాఖ సమన్లు కూడా జారీచేసింది. ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని కోరింది. కానీ మమతా బెనర్జీ లెక్కచేయలేదు. ఢిల్లీ పంపించలేదు.

నడ్డా కాన్వాయ్పై దాడి
కోల్కతాలోని డైమండ్ హార్బర్ సమీపంలో గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్పై దాడి జరిగింది. దీనిని కేంద్రం చాలా సీరియస్గా తీసుకుంది. గవర్నర్, అధికారులు వేర్వేరు నివేదికలు ఇవ్వాలని హోం మంత్రి అమిత్ షా కోరారు. బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, హోంశాఖ కార్యదర్శికి కేంద్ర హోంశాఖ సమన్లు జారీచేసింది. బెంగాల్లో శాంతి భద్రతల పరిస్ధితిపై వివరణ ఇవ్వాలని అందులో పేర్కొంది.

మేం పంపం..
దీనిపై బెంగాల్ ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, తాను ఢిల్లీ రాబోమని బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర హోంశాఖకు సమాచారం పంపించారు. ఈ నెల 14వ తేదీ లోపు రావాలని హోం శాఖ సమస్లు పంపగా.. తామెవరూ రాబోమని తిరిగి సందేశం పంపించారు. నడ్డా కాన్వాయ్పై జరిగిన దాడిని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది అని అలపన్ బండోపాధ్యాయ్ లేఖలో పేర్కొన్నారు. దాడికి సంబంధించి ఇప్పటికే మూడు ఎఫ్ఐఆర్ దాఖలు చేశామని.. ఏడుగురిని అరెస్ట్ చేశామని తెలిపారు.
Recommended Video

సెక్యూరిటీ
జెడ్ క్యాటగిరీ భద్రత గల నడ్డాకు తగిన ఏర్పాట్లు చేశామని సీఎస్ పేర్కొన్నారు. బుల్లెట్ ప్రూఫ్ కారు అందజేశామని.. ఎస్కార్ట్ వాహనం కూడా ఉంది అని చెప్పారు. డీఐజీ స్థాయి అధికారి నడ్డా పర్యటనను పర్యవేక్షించారని తెలిపారు. నలుగురు ఎస్పీలు, ఎనిమిది మంది డీఎస్పీలు, 14 మంది ఇన్ స్పెక్టర్లు, 70 మంది సబ్ ఇన్ స్పెక్టర్లు, 40 మంది ఆర్ఏఎఫ్, 259 మంది కానిస్టేబుళ్లు, 350 మంది ఇతర భద్రతా సిబ్బంది నడ్డా పర్యటించే మార్గంలో విధులు నిర్వర్తించారని తెలిపారు. నడ్డా వాహనాన్ని టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారని బీజేపీ సీరియస్గా ఉంది. ఇందుకు టీఎంసీ ధీటుగానే స్పందించింది.












Click it and Unblock the Notifications