Nagaland burning: పెరిగిన మృతుల సంఖ్య: ఇంటర్నెట్ బంద్: జవాన్లపై హత్యానేరం: కర్ఫ్యూ విధింపు
కోహిమా: ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్లో చోటు చేసుకున్న దిగ్భ్రాంతికర ఘటన తరువత- అక్కడి పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. సాధారణ పౌరులపై జవాన్లు జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య 14కు పెరిగింది. ఓ జవాన్ సహా మొత్తం 15 మంది ఇప్పటిదాకా మరణించారు. కాల్పుల అనంతరం స్థానికులు సైనిక బలగాలపై దాడులకు దిగారు. రాళ్లు రువ్వారు. వాహనాలను తగులబెట్టారు. అక్కడితో ఆగలేదు. రాత్రి ఆర్మీ క్యాంప్ పైనా దాడి చేశారు. 21 పారా ప్రత్యేక బలగాల శిబిరాన్ని ధ్వంసం చేశారు.
15కు పెరిగిన మృతుల సంఖ్య..
నాగాలాండ్లోని మోన్ జిల్లాలోని థిరు, ఒటింగ్ గ్రామంలో శనివారం రాత్రి ఒటింగ్ వద్ద గల బొగ్గు గనుల్లో పని చేసే స్థానిక యువకులు.. తమ విధులను ముగించుకుని మినీ ట్రక్లో ఇళ్లకు బయలుదేరారు. మార్గమధ్యలో థిరు గ్రామం వద్ద భద్రత సిబ్బంది వారిపై కాల్పులు జరిపారు. మిలిటెంట్లుగా భావించి కాల్పులు జరిపినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కాల్పుల్లో మొత్తం 12 మంది మరణించారు. గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు మృతి చెందారు. ఆ తరువాత స్థానికులు జరిపిన దాడిలో ఓ జవాన్ కన్నుమూశారు.
ఉద్దేశపూరకంగానే కాల్పులు..
ఈ ఘటనపై విచారణ నిర్వహించడానికి నాగాలాండ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు తమ దర్యాప్తును వేగవంతం చేశారు. ఉద్దేశపూరకంగానే జవాన్లు కాల్పులకు దిగినట్లు నిర్ధారించారు. వారిపై ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. హత్యానేరం సహా భారతీయ శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. స్థానికులను గాయపర్చడం లేదా చంపివేయాలనే కారణంతోనే ఆర్మీ జవాన్లు ఈ కాల్పులకు తెగబడినట్లు నిర్ధారించారు.
స్థానిక పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా..
సాధారణంగా ఆర్మీ జవాన్లు.. ఇలాంటి ప్రత్యేక కూంబింగ్ లేదా ఆపరేషన్స్ నిర్వహించే సమయంలో స్థానిక పోలీసుల సహకారాన్ని తీసుకుంటారు. సంబంధిత పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తారు. స్థానికులను గుర్తు పట్టడానికే వారికి ముందస్తు సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహించే సమయంలో సాధారణ పౌరులకు ప్రాణాపాయం సంభవించకుండా స్థానిక పోలీసులు.. ఆర్మీ జవాన్లకు గైడ్గా వ్యవహరిస్తారు. ఇది స్టాండర్డ్ ప్రొటోకాల్. అవేవీ లేకుండా జవాన్లు.. సాధారణ పౌరులపై కాల్పులు జరిపారని సిట్ అధికారులు నిర్ధారించారు.
ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ బంద్..
ఈ కాల్పుల ఉదంతం తరువాత మోన్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పొరుగు గ్రామాలు, పట్టణాలకూ వ్యాపించాయి. 14 మంది సాధారణ పౌరులు మరణించడంతో వారి కుటుంబీకులు, బంధుమిత్రులు దాడులకు దిగారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని నాగాలాండ్ ప్రభుత్వం తక్షణ చర్యలకు దిగింది. ఇంటర్నెట్ సేవలను స్తంభింపజేసింది. ఎస్ఎంఎస్ సర్వీసులను నిలిపివేసింది. ఫలితంగా- మోన్ జిల్లాలో ఏం జరుగుతోందనేది బాహ్య ప్రపంచానికి తెలియరావట్లేదు.
కర్ఫ్యూ విధింపు..
ఉద్రిక్త పరిస్థితులను నివారించడానికి మోన్ అధికార యాంత్రంగం జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. 144 సెక్షన్ను అమలు చేస్తోంది. ఇద్దరికి మించి స్థానికులు గుమికూడదంటూ కఠిన ఆదేశాలను జారీ చేసింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడానికి ఆ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ మోన్ జిల్లా కేంద్రంలో మకాం వేశారు. ముఖ్యమంత్రి నెఫియు రియో.. ఈ ఉద్రిక్త పరిస్థితులపై పలు దఫాలుగా సమీక్ష నిర్వహించారు. రాజకీయ నాయకులెవరినీ మోన్ జిల్లాలో వెళ్లడానికి అనుమతి ఇవ్వట్లేదు పోలీసులు. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి ఇది సరైన సమయం కాదని విజ్ఞప్తి చేస్తోన్నారు.
Recommended Video
నాగా, ఉల్ఫాలకు పట్టు ఉన్న జిల్లా..
నాగాలాండ్లోని మోన్ జిల్లాలోని థిరు, ఒటింగ్ గ్రామంలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (కే), యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (ఉల్ఫా) వంటి కొన్ని వేర్పాటువాద గ్రూపులకు గట్టిపట్టు ఉన్న జిల్లా ఇది. ప్రస్తుతం హార్న్బిల్ ఉత్సవాలు అక్కడ ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఈ హార్న్బిల్ వేడుకలను నిర్వహిస్తుంటుంది నాగాలాండ్ ప్రబుత్వం. పలువురు ప్రముఖులు దీనికి హాజరవుతుంటారు. ఇప్పటికే చాలామంది మోన్ జిల్లాకు చేరుకున్నారు.