చేతులు కట్టేసి, కళ్లకు గంతలు: 9 కుళ్లిన శవాలు
కోహిమా: నాగాలాండ్లో సంచలనాత్మక ఉదంతం చోటు చేసుకుంది. తొమ్మిది మంది గుర్తు తెలియని వ్యక్తుల శవాలు నాగాలాండ్లోని దిమపూర్ చుముకుడిమా సమీపంలోని లోయలో బయటపడ్డాయి. శవాలు కుళ్లిపోయి ఉన్నాయి. శవాలకు గంతలు కట్టి ఉన్నాయి. చేతులు వెనక్కి విరిచి కట్టేశారు.
శవాలు ఒకదానిపై మరోటి పడేసి ఉన్నాయి. శుక్రవారం రాత్రి అ శవాలు పోలీసుల కంటపడినట్లు దిమాపుర్ ఎస్పీ విజడ్ అంగామీ శనివారంనాడు చెప్పారు. కళ్లకు గంతలు కట్టి, చేతులు వెనక్కి విరచి కట్టేసి, తలలపై కాల్పులు జరిపినట్లు అర్థమవుతోందని ఆయన చెప్పారు.
శవాలపై నీలం రంగ పాలిథీన్ షీట్ కప్పారని, దానిపై బండరాళ్లు పెట్టారని ఆయన చెప్పారు. వారిని రెండు వారాల క్రితం చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. శవాలు గుర్తు పట్టనరానంతగా కుళ్లిపోయాయి.
తమ పరిధిలోని ఏ పోలీసు స్టేషన్లో కూడా వ్యక్తులు కనిపించకుండా పోయినట్లు ఫిర్యాదులు లేవని, మరో ప్రాంతంలో వారిని చంపి ఇక్కడ పడేసి ఉండవచ్చునని ఎస్పీ అన్నారు. దుర్వాసన వస్తుండడంతో కొంత మంది కూలీలు ఆ విషయాన్ని పోలీసులకు తెలిపారు. దాంతో పోలీసులు ఆ శవాలను స్వాధీనం చేసుకున్నారు.