ధాబాలో పెళ్లిరోజు విందు: మేయర్ పై దుండగుల కాల్పులు: తృటిలో..!
ముంబై: నాగ్ పూర్ మేయర్ సందీప్ జోషిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల ఘటనలో ఆయన తృటిలో తప్పించుకున్నారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కాల్పుల ఘటనలో సందీప్ జోషి, ఆయన ముఖ్య అనుచరుడు ఆదిత్య ఠాకూర్ ప్రాణాలతో బయటపడ్డారు.
మంగళవారం సందీప్ జోషి 24వ పెళ్లి రోజు. ఈ సందర్భంగా ఆయన కొంతమంది తన స్నేహితులతో కలిసి నాగ్ పూర్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో గల ఓ ధాబాలో విందును ఏర్పాటు చేశారు. విందు ముగిసిన తరువాత సందీప్ జోషి ఇంటికి బయలుదేరారు. తన ఫార్చునర్ వాహనాన్ని ఆయన స్వయంగా నడుపుకొంటూ వెళ్లారు. ఆ సమయంలో ఆయన వెంట కారులో కారులో ముఖ్య అనుచరుడు ఆదిత్య ఠాకూర్ ఉన్నారు.
మార్గమధ్యలో కారు వార్థా రోడ్డు జంక్షన్ సమీపానికి చేరుకోగానే గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ బుల్లెట్ మేయర్ కూర్చున్న డ్రైవింగ్ సీటు అద్దాలకు ధ్వంసం చేశాయి. మరో బుల్లెట్ వెనుక సీటు విండోకు తగిలింది. ఇంకో బుల్లెట్ వాహనం వెనుకవైపు తగిలింది. కాల్పులు జరిపిన వెంటనే వారు పారిపోయారు. ఈ కాల్పుల్లో ఎవరికి గాయాలు కాలేదు. వెంటనే ఆయన ఈ సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు.
సమాచారాన్ని అందుకున్న వెంటనే పోలీసులు కాల్పులు చోటు చేసుకున్న ప్రదేశానికి చేరుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై కారును అనుసరించినట్లు నిర్ధారించారు. ధాబా నుంచి బయలుదేరినప్పటి నుంచీ బైక్ పై దుండగులు కారు వెనుకే వచ్చారని, అనువైన సమయం చూసుకుని కాల్పులు జరిపినట్లు సందీప్ జోషి పోలీసులుకు వివరించారు. సంఘటనాస్థలంలో పోలీసులకు బుల్లెట్ షెల్స్ లభించాయి.