మేజర్ సహా 7గురు మృతి: ఉగ్రవాదులను అడ్డుకున్న సైనికుల భార్యలు
ఉగ్రవాదులు ఎదురుగా వచ్చినప్పుడు అందరూ వణికిపోయి పారిపోయే ప్రయత్నం చేస్తారు. కానీ, వారు అలా చేయలేదు. ఎందుకంటే వారందరూ భారత సైనికుల సతీమణులు.
శ్రీనగర్: ఉగ్రవాదులు ఎదురుగా వచ్చినప్పుడు అందరూ వణికిపోయి పారిపోయే ప్రయత్నం చేస్తారు. కానీ, వారు అలా చేయలేదు. ఎందుకంటే వారందరూ భారత సైనికుల సతీమణులు. ఉగ్రవాదులను ధైర్యసాహసాలతో నిలువరించి భారీ ప్రాణ నష్టాన్ని తప్పించారు. తమ వెంట నవజాత శిశువులున్నా వారు భయపడలేదు.
ఈ శిశువుల్లో ఒక శిశువు వయస్సు 18 నెలలు కాగా మరో శిశువు వయస్సు రెండు నెలలే ఉండటం గమనార్హం. నగ్రోటాలో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు సైనిక కుటుంబాలు నివసించే క్వార్టర్లలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. అయితే ఇద్దరు సైన్యాధికారుల సతీమణులు అపార సాహసాన్ని ప్రదర్శించారు.
క్వార్టర్లలోకి ప్రవేశించే ద్వారానికి ఇంటిలో ఉండే వస్తువులన్నింటినీ అడ్డుపెట్టారు. ఉగ్రవాదులు చొరబడడం కష్టమయ్యేలా చేశారు. ఈ మహిళలు ఈ పని చేయకుండా ఉండిఉంటే వారిని ఉగ్రవాదులు బందీలుగా పట్టుకుని సైన్యానికి, వారి కుటుంబాలకు భారీ నష్టం చేసి ఉండేవారని ఓ సైనికాధికారి తెలిపారు.
ఉగ్రదాడిలో మేజర్ సహా ఏడుగురు మృతి
పోలీస్ దుస్తులు ధరించిన ఒక ఉగ్రమూక భారీ ఆయుధాలతో జమ్మూ శివారుల్లోని నగ్రోటాలో 166 ఆర్టిలరీ యూనిట్పై మంగళవారం దాడికి దిగింది. సైన్యం తీవ్రంగా ప్రతిఘటించి వారిని హతమార్చింది. ఈ దాడిలో మేజర్ సహా ఏడుగురు సైనికులు అమరులయ్యారు. ఈ దాడి సందర్భంగా ఉగ్రవాదులు కొద్ది సేపు 12 మంది సైనికులను, ఇద్దరు మహిళలను, ఇద్దరు శిశువులను బందీలుగా పట్టుకునేంత పని చేశారు. వారందరినీ సైన్యం రక్షించింది.
నగ్రోటా దాడికి సంబంధించి సైన్యం అధికార ప్రతినిధి వెల్లడించిన వివరాల ప్రకారం... ఉగ్రవాదులు గ్రెనేడ్లను విసురుతూ నగ్రోటా యూనిట్లోని ఆఫీసర్స్ మెస్ ఆవరణలోకి బలవంతంగా ప్రవేశించారు. వారిని ఆ దశలోనే ప్రతిఘటించే క్రమంలో సైన్యాధికారి ఒకరు, ముగ్గురు సైనికులు అమరులయ్యారు. అధికారులు, కుటుంబాలు, ఇతరులున్న రెండు భవంతుల్లోకి ఉగ్రవాదులు ప్రవేశించడంతో బందీలుగా చిక్కే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని సైన్యం వెంటనే కట్టడి చేసింది. ఆ భవంతుల్లో ఉండేవారిని రక్షించే ప్రయత్నంలో మరో అధికారి, ఇద్దరు జవాన్లు అమరులయ్యారు.
ఈ సందర్భంగా సైన్యం జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడిలో మృతి చెందిన అధికారులను మేజర్ గోసావి కునాల్ మన్నదీర్(33), మేజర్ అక్షయ్ గిరీష్ కుమార్ (31)గా గుర్తించారు. గోసావి కునాల్.. మహారాష్ట్రలోని సోలాపుర్ జిల్లాకు చెందిన వారు. అక్షయ్.. బెంగళూరు వాసి. అసువులు బాసిన ఇతర సైనికులు.. హవల్దార్ సుఖ్రాజ్ సింగ్(32)- పంజాబ్లోని గుర్దాస్పుర్, లాన్స్నాయక్ కదమ్ శంభాజీ యశోవంతరావ్ (32)- మహారాష్ట్రలోని నాందేడ్, రాఘవేంద్ర సింగ్(28)-రాజస్థాన్లోని ధోల్పుర్, ఆసిప్ రాయ్ (32)-నేపాల్లోని ఖోటంగ్. కాగా, అమరుడయిన మరో సైనికుడి పేరును వెల్లడించలేదు.