ట్విస్ట్: సుబేదార్ పతన్కు వలేసింది అనుష్క కాదు..అలీ!
హైదరాబాద్: ఇటీవల సంచలనం సృష్టించిన సైనిక రహస్యాల గూఢచర్యం కేసు అనుహ్యమైన మలుపు తరిగింది. భారత సైనిక అంతర్గత రహస్యాలను పాక్ గూఢచారికి అందజేసిన పతన్ కుమార్ నుంచి సైనిక రహస్యాలను సేకరించింది మహిళ కాదని.. మరో సైనికుడేనని తేలింది. అతను అనుష్క శర్మ పేరుతో పతన్ను నమ్మించి వలే వేశాడని తెలిసింది. పాకిస్థాన్ గూఢచారి అనుష్క శర్మ.. యువతి కాదని ఉత్తరప్రదేశ్లోని మీరట్ సైనిక విభాగంలో విధులు నిర్వహిస్తున్న అసిఫ్ అలీగా సైనికాధికారులు నిర్ధరించారు.
మీరట్ కొత్వాల్ ఠాణాలో అలీపై కేసు నమోదు చేయించి రహస్యంగా విచారణ జరుపుతున్నారు. అసిఫ్ అలీ దొరికిపోవడంతో అతడిని తమకు అప్పగించాలంటూ పోలీసులు సైన్యాధికారులను కోరారు. అలీ బార్య పాకిస్థాన్ దేశస్థురాలని, వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని నిఘా విభాగం అధికారులకు సమాచారం అందినట్లు తెలిసింది.
సికింద్రాబాద్లోని ఆర్టిలరీ కేంద్రంలో పనిచేస్తున్న పతన్ కుమార్ను దేశద్రోహం కేసు కింద సెంట్రల్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో పతన్ చెప్పిన వివరాలు, పతన్ తన కార్యాలయంలో వినియోగించిన కంప్యూటర్, మరికొన్ని అంతర్గత వివరాలను పరిశీలించడం ద్వారా సైన్యంలోని నిఘా విభాగం అధికారులు ఈ కేసులో కీలక సమాచారాన్ని సేకరించగలిగారు.
పతన్ను అసిఫ్ అలీ ఐదు నెలల క్రితం అనుష్క శర్మ పేరుతో ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత ఫోన్లో అసిఫ్ అలీ తన భార్యతో మాట్లాడించినట్లు సైన్యాధికారులు భావిస్తున్నారు. మాట్లాడింది మహిళే అయినా తెర వెనుక కథ నడిపించింది మాత్రం అసిఫ్ అలీనేనని తెలుస్తోంది. భారత్లోని ఇతర రెజిమెంట్లు, సైనిక వివరాలను అడిగిన అతను.. తాను ఎవరనేది తెలియనివ్వలేదు.
పలుమార్లు తనకు డబ్బులు కూడా పంపించారని పతన్ విచారణలో తేలిపిన విషయం తెలిసిందే. అసిఫ్ అలీ వ్యక్తిగత వివరాలను సైనిక నిఘా విభాగం సేకరిస్తున్నట్లు తెలిసింది. పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్లతో సంబంధం ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. విచారణ పూర్తయిన తర్వాతే మిగితా విషయాలు బహిర్గతమయ్యే అవకాశం ఉంది.