126 సెక్షన్ కింద టీవీల్లో ప్రసారాలు బంద్ : ఇంతకీ ఈ సెక్షన్ ఏం చెబుతోంది ?
న్యూఢిల్లీ : ఎన్నికల వేళ టీవీ చానెళ్ల ప్రసారాలకు ఎన్నికల సంఘం ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఇక పార్టీ చానెళ్ల విషయంలో ఈసీ డేగ కళ్లతో ప్రసారాలను పర్యవేక్షిస్తోంది. బీజేపీ సొంత చానెల్ నమో టీవీ ప్రసారాలను ఈసీ సునిశీతంగా పరిశీలిస్తోంది.
రెండురోజుల ముందు బంద్
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రచారం ముగిసిన వెంటనే ఎన్నికలకు సంబంధించిన సమాచారం ప్రసారం నిషేధం. ఇది ముఖ్యంగా నమో టీవీ చానెల్కు వర్తిస్తోందని ఈసీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఎన్నికల నియమావళిని అనుసరించి ఆయా సంస్థలు నడుచుకోవాలని మరోసారి స్పష్టంచేసింది.
6 విడతల్లో పర్యవేక్షణ
తొలివిడత సార్వత్రిక ఎన్నికలు ముగిసినందున .. మరో 6 విడతల్లో జరిగే ఎన్నికలకు సంబంధించి రెండురోజుల ముందే సంబంధిత చానెళ్లకు మార్గదర్శకాలు జారీచేయాలని ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ను ఈసీ ఆదేశించింది. ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ అధికారి నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తుండటంతో .. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. చీఫ్ ఎలక్టోరల్ అధికారి పర్యవేక్షణలోని బృందం దేశంలోని టీవీ చానెళ్లు వార్తలు, సంబంధిత కథనాలను పర్యవేక్షిస్తోంది.
126 సెక్షన్
ఎన్నికలు జరిగే 48 గంటల ముందు రాజకీయాలకు సంబంధించిన వార్తలు ప్రసారం చేయొద్దని 126 సెక్షన్ చెబుతోంది. ఇది ఎన్నికల నియామవళి ఉల్లంఘన కిందకు వస్తోందని, గుర్తుచేసింది. ఈ సమయాన్ని సైలెన్స్ పీరియడ్ గా వారు అభివర్ణిస్తున్నారు. ఇప్పుడు ప్రజలు తమ సొంత ఆలోచనలతో ముందుకు సాగాలే తప్ప .. రాజకీయ పార్టీలు ప్రభావితం చేయొద్దని గుర్తుచేస్తోంది. అయితే 126 ఎలక్ట్రానికి మీడియాకే వర్తిస్తోంది. ప్రింట్ మీడియాకు ఈ నియమాలు వర్తించవని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.