నందిగ్రామ్ ఘటన: మమతా బెనర్జీ సెక్యూరిటీ డైరెక్టర్పై ఈసీ వేటు, మరో ఇద్దరు అధికారులపైనా
కోల్ కతా: నందిగ్రామ్ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. మమతా బెనర్జీ సెక్యూరిటీ డైరెక్టర్పై ఎన్నికల సంఘం వేటు వేసింది. జడ్ ప్లస్ భద్రత కలిగిన వ్యక్తికి రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని పేర్కొంటూ ఐపీఎస్ అధికారి వివేక్ సహాయ్ను వెంటనే సస్పెండ్ చేయాలని సీఎస్కు ఆదేశాలు జారీ చేసింది. అతనిపై అభియోగాలు నమోదు చేయాలని పేర్కొంది.
మమతా బెనర్జీ కాలికి గాయమైన నేపథ్యంలో నందిగ్రామ్ వెళ్లి పరిశీలించిన ప్రత్యేక పరిశీలకులు ఆమెపై ఎలాంటి దాడి జరగలేదని, ప్రమాదవశాత్తూ ఆమె గాయపాలయ్యారని ఈసీకి నివేదిక సమర్పించారు. ఘటన జరిగేటప్పుడు ఆమె చుట్టూ భారీగా సిబ్బంది ఉన్నారని, సీఎంకు అతి సమీపంగా జనం తోసుకుంటూ వచ్చినా వారిని నియంత్రించడంలో పోలీసులు, భద్రతా సిబ్బంది విఫలమయ్యారని నివేదికలో స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం సీరియస్గా స్పందించింది. మమత సెక్యూరిటీ డైరెక్టర్ వివేక్ సహాయ్ తోపాటు పుర్బి మేదినీపూర్ ఎస్పీ ప్రవీణ్ ప్రకాశ్ ను కూడా ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. మమతా బెనర్జీకి తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంలో ఆయన విఫలమయ్యారని మండిపడింది.
అంతేగాక, మిడ్నాపూర్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ విభు గోయల్ను బదిలీ చేసింది. ఎన్నికలకు సంబంధం లేని బాధ్యతలను అప్పగించింది. పంజాబ్ ఇంటెలీజెన్స్ మాజీ అధికారి అనిల్ కుమార్ శర్మను పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రత్యేక పోలీసు పరిశీలకునిగా నియమించింది.
కాగా, 294 స్థానాలు గల పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి మార్చి 27 నుంచి 8 విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మే 2న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. అధికార టీఎంసీ, బీజేపీల మధ్య నువ్వానేనా అన్నట్లు ఈ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మమతా బెనర్జీ మూడోసారి అధికారం చేపట్టేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక బీజేపీ కూడా అధికారం చేజిక్కించుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తోంది. మే 2న అసలైన ఫలితాలు వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications