టెర్రరిజం పెను ముప్పు: మోడీ స్పీచ్కు అమెరికా కాంగ్రెసు ఫిదా
హైదరాబాద్: అమెరికా ప్రజాస్వామ్యానికి దేవాలయం వంటిదని, ప్రజాస్వామ్య పునాదులే అమెరికా, భారత్ బలమని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అమెరికా కాంగ్రెసులో ఆయన బుధవారంనాడు ప్రసంగించారు. ఆయన ప్రసంగానికి సభ్యులు పలుమార్లు హర్షధ్వానాలు చేశారు. సీట్లలోంచి లేచి ఆయన ప్రసంగానికి కరతాళ ధ్వనులు చేారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని అన్నారు.
వాజ్పేయి పర్యటన తర్వాత భారత, అమెరికా సంబంధాలు మెరుగు పడ్డాయని ఆయన చెప్పారు. అంబేడ్కర్ భారత రాజ్యాంగ రచనలో అమెరికా రాజ్యాంగ ప్రభావం ఉందని ఆయన అన్నారు. గాంధీజీ అహింసా సిద్ధాంతం మార్టిన్ లూథర్ను ప్రభావితం చేసింది. మానవజాతి శాంతియుత జీవనానికి అమెరికా ఎంతో కృషి చేసిందని ఆన అన్నారు. అబ్రహం లింకన్ సూక్తులను ప్రస్తావిస్తూ ఆయన ప్రసంగం చేశారు.
ఉగ్రవాదం ప్రపంచానికి పెద్ద ముప్పుగా పరిణమించిందని ఆయన చెప్పారు. రాజకీయం కోసం ఉగ్రవాదాన్ని ప్రబోధించి, ఆచరించేవారిని నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బహుళ స్థాయిలో పోరాటం చేయాలని అన్నారు. పౌరులను, సైనికులను కోల్పోయామని చెప్పారు. మానవత్వాన్ని విశ్వసించే వారంతా ఏకమై ముక్తకంఠంతో ఎదుర్కోవాలని అన్నారు.
లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు భారత్లో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని, వాటిని తిప్పికొట్టి తమను ఏమీ చేయలేవనే సంకేతాలను పంపుతున్నామని చెప్పారు. అన్ని స్థాయిల్లో ఉగ్రవాదంపై పోరాడుతున్నామని చెప్పారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలనే ఉమ్మడి లక్ష్యం నెరవేరే సమయం ఆసన్నమైందని చెప్పారు. మంచి ఉగ్రవాదం, చెడు ఉగ్రవాదం ఉండదని అన్నారు. ఉగ్రవాదానికి చట్టబద్దత అనేది ఎక్కడా ఉండదని, ఉండకూడదని అన్నారు.
అఫ్గనిస్తాన్లో అమెరికా, భారత్ కృషి ప్రపంచానికే తలమానికంగా నిలిచిందని అన్నారు. అఫ్గనిస్తాన్లో భారత్ కృషిని ప్రపంచం గుర్తించిందని చెప్పారు. అమెరికా, భారత్ సైనికులు ఉగ్రవాదానికి గురయ్యారని చెప్పారు.
ఇండియన్ అమెరికన్లను చూసి గర్వపడుతున్నానని, ప్రపంచానికి భారత్ యోగాను అందించినందుకు గర్వపడుతున్నానని ఆయన అన్నారు. చికాగోలో స్వామి వివేకానంద ప్రసంగం భారత సంస్కృతిని, గొప్పదనాన్ని చాటి చెప్పిందని అన్నారు. భారత్, అమెరికా సహజ మిత్రులని వాజ్పేయి చెప్పారని అన్నారు. నార్మన్ బోర్లాగ్ హరిత విప్లవం వల్ల భారత్కు ఆహార భద్రత లభించిందని చెప్పారు.
అమెరికా కాంగ్రెసులో ప్రసంగించడం ఆనందంగా ఉందని చెప్పారు. మనం మన మేలు కోసమే పని చేయడం లేదని, ప్రపంచం యావత్తు మేలు కోసం పనిచేస్తున్నామని చెప్పారు. ఒబామా హయాంలో భారత్, అమెరికా సంబంధాలు మరింత మెరుగయ్యాయని అన్నారు.
అమెరికాలో ఎన్నో రంగాల్లో భారతీయులు రాణిస్తున్నారని చెప్పారు. భారత్, అమెరికా సంబంధం కొత్త అవకాశాలకు నాంది అవుతుందని అన్నారు. భారత్ కష్టాల్లో ఉన్నప్పుడు అమెరికా అందించిన సాయం మరిచిపోలేనిదని ఆయన అన్నారు. భారత్ అమెరికాకు నమ్మకమైన భాగస్వామి అవుతుందని చెప్పారు.