మత విషయంలో మోడీ, ఒబామా ఒకటే: రిచర్డ్ వర్మ
న్యూఢిల్లీ: మతపరమైన హింసా సంఘటనల విషయంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒకే విధంగా స్పందిస్తున్నారని భారత్లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ అభిప్రాయపడ్డారు. భారత్లో చర్చిలపై జరుగుతున్న దాడుల తరహాలోనే అమెరికాలో అక్కడక్కడా హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని గుర్తు చేశారు.
అనేక సంప్రదాయాలు నిండిన భారతదేశం వంటి దేశంలో మత హింసకు తావుండరాదని భావిస్తున్నట్లు తెలిపారు. ఇదే విధంగా మోడీ, బరాక్ ఒబామాలు కూడా కోరుకుంటున్నారని చెప్పారు. ఇటీవల మతపరమైన విషయాల్లో భారత్ సరైనరీతిలో స్పందించడం లేదంటూ ఓ అమెరికన్ సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో విదేశాంగ శాఖ వివరణ కోరిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రిచర్డ్ వర్మ స్పందిస్తూ.. తమకు ఇండియాతో బలమైన సంబంధాలున్నాయని, మనస్ఫూర్తిగా మాట్లాడుకోకపోవడం వల్లే కొన్ని విషయాల్లో విభేదాలు వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. మాట్లాడుకోవడం వల్ల సమస్యలు పరిష్కారమై ముందుకు వెళ్లగలమని చెప్పారు.
రెండు దేశాలు అభ్యున్నతిని సాధిస్తూ ముందుకెళ్తున్నాయని రిచర్డ్ వర్మ తెలిపారు. మోడీ ఏడాది పాలనా కాలంలో అమెరికా-భారత సంబంధాలు మరింత మెరుగుపడ్డాయని చెప్పారు. ఒక నూతన అధ్యాయనం మొదలైందని చెప్పారు. మోడీ, ఒబామా చేతులు కలపడం వల్ల రెండు దేశాల మధ్య చాలా ఒప్పందాలు కుదిరాయని తెలిపారు.