మోడీ తొలి కేబినెట్, పోలవరంపై చర్చ!: గుజరాత్ భవన్లో
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ మంత్రివర్గం మంగళవారం సమావేశమైంది. తొలి కేబినెట్లో పలు కీలక అంశాల పైన చర్చ జరిగిందని సమాచారం. ఈ కేబినెట్లో ఆంధ్రప్రదేశ్ విభజన పైన అధికారులు నివేదిక ఇచ్చారని సమాచారం. పోలవరం ప్రాజెక్టు, ముంపు గ్రామాల విలీనం పైన ఓ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు.
కేబినెట్లో విదేశాల్లో ఉన్న నల్లధనం వెనక్కి తెచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించినట్లుగా సమాచారం. అలాగే పార్లమెంటు సమావేశాల పైన కూడా చర్చ జరిపారని సమాచారం. నల్లధనం, ఎపి విభజన, పార్లమెంటు సమావేశాలు తదితరాలు చర్చకు వచ్చాయని తెలుస్తోంది.
ప్రస్తుతానికి గుజరాత్ భవన్లోనే మోడీ
ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ అధికారిక నివాసానికి వెళ్లేందుకు మరికొన్ని రోజుల సమయం పట్టవచ్చు. ప్రధాని అధికారిక నివాసాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఖాళీ చేశారు.
అయితే అందులో మరమ్మత్తులు చేయాల్సి ఉందని, అందుకు మరో నాలుగైదు రోజుల సమయం పడుతుందని తెలిసింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి మోడీ గుజరాత్ భవన్లోనే ఉంటున్నారు. ఇక, ఇప్పుడు ఆయన రేస్ కోర్సు రోడ్డులోని 7కి బదులుగా 5వ నెంబరు భవంతిని అధికారిక నివాసంగా మార్చుకోనున్నట్లు తెలిసింది.