దేశానికి మోడీ మంచి ప్రధాని... కానీ మిజోరాంలో బీజేపీకి స్థానం లేదు: జోరంతంగా
మిజోరాం: మిజోరాం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అక్కడ ప్రచారం ఊపందుకుంది. మొత్తం 40 సీట్లున్న మిజోరాం రాష్ట్రంలో మెజార్టీ సీట్లు సాధించే దిశగా ఆయా పార్టీలు కృషి చేస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని అదే తమకు కలిసొస్తుందంటున్నారు ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్ నేత మాజీ ముఖ్యమంత్రి జోరంతంగా.

కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారు
ప్రజలు కాంగ్రెస్ పాలనతో విసిగి వేశారి పోయారని తమకు పూర్తి మెజార్టీ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రాభివృద్ధి కుటుంపడిందని జోరంతంగా అన్నారు. ఎన్జీఓలు, చర్చీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిందని... అంతేకాక మద్యం సేవించి ఇక్కడ చాలా మంది చనిపోవడానికి కాంగ్రెస్ కారణమైందని జోరంతంగా ధ్వజమెత్తానరు.అంతేకాదు మిజోరాం రాష్ట్రంలో కాంగ్రెస్ అధోగతి పాలవుతోందన్నారు. ఇప్పటికే మిజోరాం హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తి మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీలో చేరారు. ఇక అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన వ్యక్తితో పాటు కాంగ్రెస్ కార్యదర్శులు కూడా ఆపార్టీని వీడుతున్నారని అన్నారు.

రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తాం
తాము అధికారంలోకి వస్తే అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు జోరంతంగా. సామాజిక ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అయ్యే కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. అంతేకాదు రాష్ట్రంలో మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పారు. సామాజిక ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతేనే రాష్ట్రానికి సరిపడా ఆహారం ఉంటుందని చెప్పిన జోరంతంగా రైతులకు అండగా నిలుస్తామని చెప్పారు. రైతులకు కనీస మద్దతు ధర, సబ్సీడీలు, బీమాలు, రిబేట్లు కల్పిస్తామని అదే అంశాలను మేనిఫెస్టోలో చేర్చినట్లు చెప్పారు జోరంతంగా.

మోడీ నా స్నేహితుడు... కానీ బీజేపీకి రాష్ట్రంలో స్థానం లేదు
ఇక ఎన్నికల తర్వాత బీజేపీ ఎంఎన్ఎఫ్ పార్టీల మధ్య పొత్తు ఉంటుందని వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు జోరంతంగా. చక్మా అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో కాంగ్రెస్ బీజేపీతో పొత్తు పెట్టుకుందని ఆ గతి తమకు పట్టలేదని చెప్పారు. మిజోరాంలో మెజార్టీ క్రిస్టియన్లు ఉన్నారని చెప్పిన జోరంతంగా... ప్రధాని మోడీ వచ్చి ఇక్కడ ప్రచారం నిర్వహిస్తే ప్రజలు తమాషా చూసేందుకు మాత్రమే వెళతారని దాని ప్రభావం ఎన్నికల మీద ఉండదని అన్నారు. అయితే తన కార్యాలయంలో ప్రధాని మోడీ ఫోటో ఉందన్న ప్రశ్నకు... మోడీ తన స్నేహితుడని చెప్పారు జోరంతంగా. భారత దేశానికి ఆయన మంచి ప్రధాని అంతే తప్ప బీజేపీకి మిజోరాంలో స్థానం లేదన్నారు. రాష్ట్రంలోని క్రిస్టియన్లు హిందూ మత రాజకీయాలకు వ్యతిరేకమన్నారు. మిజోరాం ఎన్నికలు పరిగణలోకి తీసుకున్నంత వరకు ఎంఎన్ఎఫ్కు బీజేపీతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications