పన్ను వ్యవస్థలో సంస్కరణలు... ప్రత్యేక ప్లాట్ఫామ్... ప్రధాని మోదీ స్పీచ్ హైలైట్స్ ఇవే...
ప్రధాని నరేంద్ర మోదీ 'పారదర్శక పన్ను-నిజాయితీని గౌరవించడం' అనే ప్లాట్ఫామ్ను గురువారం(అగస్టు 13) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. భారతదేశ పన్ను వ్యవస్థను సంస్కరించే,సరళీకరించే విధానాలను బలోపేతం చేయడంలో ఇది ఉపయోగపడుతుందన్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించే చర్యల్లో భాగంగా నిజాయితీగా పన్ను చెల్లిస్తున్నవారికి అందుకు తగిన ప్రోత్సాహకం అందించేందుకు ఉపయోగపడుతుందన్నారు.
Recommended Video

సెప్టెంబర్ 25 నుంచి ఫేస్లెస్ అప్పీల్
భారత పన్ను వ్యవస్థలో నిర్మాణాత్మక సంస్కరణలు ఈరోజు ఒక అంకానికి చేరుకున్నాయి. 'పారదర్శక పన్ను వ్యవస్థ-నిజాయితీని గౌరవించిడం' అనే విధానం ఫేస్లెస్ అసెస్మెంట్స్,ఫేస్లెస్ అప్పీల్,ట్యాక్స్ పేయర్ చార్టర్ను కలిగి ఉంటుందన్నారు. సెప్టెంబర్ 25వ తేదీ నుంచి ఫేస్లెస్ అప్పీల్ అమలులోకి వస్తుందన్నారు. టాక్స్పేయర్ చార్టర్ నేటి నుంచే అందుబాటులో ఉంటుందన్నారు. ఇంతకుముందు,తమ ఫోకస్ అన్బ్యాంకింగ్ను బ్యాంకింగ్ చేయడం,నిధులు లేని వాటికి నిధులు కేటాయించడం వంటి వాటిపై ఉండిందన్నారు. కానీ ఇప్పుడు నిజాయితీగా పన్ను చెల్లించేవారిని ప్రోత్సహించాలనుకుంటున్నామన్నారు.

పబ్లిక్ ఫ్రెండ్లీ పన్ను వ్యవస్థ..
పన్ను వ్యవస్థ విధానం,నియమాలు,చట్టం ప్రతీది ప్రజలకు అనుకూలించే దృక్పథంతో ఉండబోతుందని,పబ్లిక్ ఫ్రెండ్లీ విధానం తీసుకురాబోతున్నామని చెప్పారు. ఒకప్పుడు సంస్కరణలంటే... ఒత్తిళ్ల నడుమనో,నిరాశతోనో నిర్ణయాలు ఉండేవని... కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని మోదీ అన్నారు. సంస్కరణలంటే విధాన ఆధారితమైనవని,అవ్యవస్థీకృతమైనవని కాదని పేర్కొన్నారు. ఒక చారిత్రాత్మక సంస్కరణ మరో సంస్కరణకు పునాదిగా మారుతుందని... తద్వారా మరిన్ని కొత్త సంస్కరణలకు అవకాశం ఏర్పడుతుందని అన్నారు. ఒక సంస్కరణ వద్దే మనం ఆగిపోమని... ఇది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు.

అప్పటినుంచి ఇంకా అవే చట్టాలు...
భారతీయ పన్ను వ్యవస్థలో ప్రాథమిక,నిర్మాణాత్మక సంస్కరణల అవసరం ఉందని మోదీ అన్నారు. ఎప్పుడో బ్రిటీష్ బానిసత్వ కాలంలో రూపొందించిన వ్యవస్థనే ఇన్నాళ్లు కొనసాగుతూ వచ్చిందన్నారు. స్వాతంత్య్రం తర్వాత దేశంలో ఎన్నో మార్పులు వచ్చినా... పన్ను వ్యవస్థ పాత్ర మాత్రం అలాగే ఉండిపోయిందన్నారు. సంక్లిష్టత ఉన్నచోట పారదర్శకత కష్టమన్నారు. కాబట్టి చట్టం స్పష్టంగా ఉంటే పన్ను చెల్లింపుదారులతో పాటు దేశం కూడా సంతోషంగా ఉంటుందన్నారు.

కేంద్ర ప్రభుత్వ సంస్కరణలు...
తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా పన్ను విధానంలో అనేక సంక్లిష్టతలు సమసిపోయాయని మోదీ అన్నారు. రూ.5లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి సున్నా ట్యాక్స్ చేశామని గుర్తుచేశారు. మిగతా శ్లాబ్స్లోని ట్యాక్స్ పేయర్స్కు కూడా పన్నును తగ్గించామన్నారు. మన పన్ను విధానం ఎలాంటి సాఫీగా,ఇబ్బందులు లేకుండా,ఫేస్ లెస్గా ఉండాలన్నారు. ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ పన్ను చెల్లింపుదారులను ఇబ్బందులకు గురిచేయకుండా వారి సమస్యలను పరిష్కరించాలన్నారు.

టెక్నాలజీతో సరళీకృత విధానం...
ఇప్పటివరకూ మనం నివసించే పట్టణంలో ఉన్న ట్యాక్స్ డిపార్ట్మెంట్ పన్ను వ్యవస్థ వ్యవహారాలు చూస్తూ వచ్చింది. కానీ ఇక నుంచి దానికి ముగింపు పలికినట్లే.సాంకేతిక పరిజ్ఞానంతో, పరిశీలనాత్మక విషయాలను యాదృచ్ఛికంగా ఐటి శాఖ అధికారులకు అప్పగిస్తారు. ఏ కేసును ఎవరికి అప్పగించాలన్నది అల్గారిథమ్స్ నిర్ణయిస్తాయన్నారు. పన్నులకు సంబంధించిన సమస్యలే కాకుండా, విజ్ఞప్తులు కూడా ఫేస్లెస్గా ఉంటాయన్నారు.

పన్ను చెల్లింపుదారులను గౌరవించాలని...
ఫేస్ లెస్ అసెస్మెంట్తో పన్ను చెల్లింపుదారుడికి గౌరవం,మర్యాద లభిస్తాయన్నారు మోదీ. పన్ను చెల్లింపుదారుల ఆత్మగౌరవానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వారిని విశ్వసించాలని,ఎలాంటి ఆధారాలు లేకుండా వారిని అనుమానించరాదని పేర్కొన్నారు. ట్యాక్స్ పేయర్స్ చార్టర్ కూడా దేశ అభివృద్దికి కీలకంగా మారుతుందన్నారు. '2012-13లో దాఖలు చేసిన అన్ని పన్ను రిటర్న్స్లో 0.94 శాతం కేసుల పరిశీలన జరిగింది. 2018-19 సంవత్సరంలో ఈ సంఖ్య 0.26 శాతానికి పడిపోయింది. అంటే, కేసు పరిశీలన దాదాపు 4 రెట్లు తగ్గింది. గత ఆరేళ్లలో భారత ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ కొత్త పాలనా నమూనాను చూసింది.' అని పేర్కొన్నారు.

పెరిగిన పన్ను చెల్లింపుదారులు...
కేంద్రం పన్ను వ్యవస్థలో పలు సంస్కరణలు తీసుకొచ్చిన నేపథ్యంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య గత ఆరేళ్లలో రెండున్నర కోట్లకు పెరిగిందన్నారు. అయితే 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇది చాలా తక్కువ సంఖ్య అన్నారు. 'ఎవరైతే పన్ను చెల్లించే స్థితిలో ఉండి... ఇప్పటికీ పన్ను చెల్లించట్లేదో... ఇప్పటికైనా తమకు తాము ముందుకు రావాలి. ఇది నా విజ్ఞప్తి,నమ్మకం.' అని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications