బెంగాళీలో మాట్లాడిన చంద్రబాబు, ఏపీ సీఎం ప్రశ్నకు గట్టిగా జవాబివ్వాలని మమతా బెనర్జీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో మమతా బెనర్జీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తొలుత బెంగాళీలో మాట్లాడి రాష్ట్ర ప్రజలకు (పశ్చిమ బెంగాల్) శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మోడీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ ప్రచార ప్రధానమంత్రే కానీ, పని చేసే ప్రధాని కాదన్నారు. అందుకే 22 పార్టీలు సేవ్ ఇండియా సేవ్ డెమోక్రసీ పేరుతో కలిసినట్లు తెలిపారు.
బ్రిగేడ్ మైదానం గురించి చంద్రబాబు
విపక్షాలను ఒక్కతాటి పైకి తెచ్చి, లక్షలాదిమందితో బ్రిగేడ్ మైదానంలో ఇంతటి భారీ సభ నిర్వహించిన మమతా బెనర్జీకి ఏపీతో పాటు దేశ ప్రజల తరఫున చంద్రబాబు అభినందనలు తెలిపారు. బ్రిగేడ్ మైదానానికి గొప్ప చరిత్ర ఉందని, దేశానికి ఎప్పుడు సంక్షోభం తలెత్తినా ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. తర్వాత దేశం మొత్తం దాన్ని అనుసరించడం అలవాటు చేసుకుందన్నారు. దానివల్ల ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయన్నారు.
ఏం చెప్పారు, ఏం చేశారు
జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన పెద్ద పెద్ద నేతలు ఇప్పుడు ఈ మైదానంలో ఉన్నారని, దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే తమ అందరి ఏకైక లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. అందుకే తామంతా దేశాన్ని ఏకం చేయాలనుకుంటున్నామని, అయిదేళ్ల క్రితం ఈ దేశ ప్రజలు ఎన్డీయే, బీజేపీ ప్రభుత్వానికి స్పష్టమైన మెజార్టీ ఇచ్చారని, కానీ వాళ్లు దేశాన్ని మోసం చేశారన్నారు. జన్ధన్, మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్వచ్ఛభారత్, ముద్ర రుణాలు, సుపరిపాలన, అవినీతి రహిత వ్యవస్థ, స్మార్ట్సిటీలు, నల్లధనాన్ని వెనక్కు రప్పించడం, ఏటా రెండుకోట్ల ఉద్యోగాలకల్పన, మంచి రోజులు, సబ్ కే సాత్ సబ్ కే వికాస్ పేర్లతో ఎన్నో నినాదాలిచ్చారన్నారు. రాఫెల్ కుంభకోణం చాలా పెద్దది అన్నారు.
మోడీ, అమిత్ షాలు పోవాలా వద్దా అని చంద్రబాబు
చంద్రబాబు తన ప్రసంగం చివరలో మోడీ, అమిత్ షాలు పోవాలా.. వద్దా అని సభికులను ఉద్దేశించి ప్రశ్నించారు. వారంతా పోవాలి.. పోవాలి అన్నారు. మమతా బెనర్జీ జోక్యం చేసుకొని ఇంకా గట్టిగా చెప్పాలని సూచించారు. దీంతో సభకు వచ్చిన వారి మరింత ఉత్సాహంతో పోవాలి.. పోవాలి అన్నారు.