మోడీ కేబినెట్లో 50 మంది: టిడిపికి ఒక్కటే, సీమాంధ్రకు!
న్యూఢిల్లీ: కాబోయే ప్రధానమంత్రి కేబెనెట్లో 50 మంది ఉండే అవకాశముంది. అందులో 26 కేబినెట్ పదవులు కాగా, మిగతావి సహాయ పదవులు. కేంద్ర మంత్రివర్గ రూపకల్పనలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టాలని మోడీ సంకల్పించడంతో కేంద్ర కేబినెట్ పరిమితంగానే ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. అదే సమయంలో అవినీతిపరులకు తన కేబినెట్లో చోటు ఇవ్వకూడదని మోడీ దృఢ నిశ్చయంతో ఉన్నారు.
పూర్తి మెజారిటీ సాధించిన బిజెపితోపాటు టిడిపి, అకాలీదళ్, శివసేన, లోక్ జనశక్తి పార్టీలకు మాత్రమే కేంద్ర కేబినెట్లో చోటు దక్కే సూచనలు కన్పిస్తున్నాయి. ఇతర చిన్నాచితక పార్టీలకు అవకాశం దక్కకపోవచ్చంటున్నారు. మోడీ ఆలోచన ప్రకారం 13 మంది ఎంపీలకు ఒక కేబినెట్ పదవి ఇచ్చే అవకాశాలున్నాయి. ఈ లెక్కన 336 మంది ఎన్డీఏ సభ్యుల్లో 26 మందికి కేబినెట్ హోదా లభించే సూచనలున్నాయి.

మిగిలిన వారికి సహాయ హోదా లభిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద మోడీ మంత్రివర్గ సభ్యుల సంఖ్య 50 లోపే ఉండే అవకాశాలున్నాయి. సంకీర్ణ రాజకీయాల కారణంగా గత ప్రభుత్వ హయాంలో రకరకాల మంత్రిత్వశాఖలు ఏర్పరిచారని, వాటన్నిటినీ కుదించి పరిమిత శాఖలనే ఏర్పాటు చేయాలని మోడీ భావిస్తున్నారట. ఏఏ శాఖల్ని విలీనం చేయాలన్న విషయంపై తగిన సూచనలు ఇవ్వాల్సిందిగా ఇప్పటికే ఆయన అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు, రాజ్నాథ్ సింగ్లను కోరారు.
అంతర్జాతీయ వాణిజ్య రంగానికి అనుగుణంగా విదేశాంగ విధానాన్ని మార్పు చేసేందుకు విదేశాంగ శాఖను వాణిజ్య మంత్రిత్వశాఖను కలిపి ఒకే శాఖగా మార్చే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఇది సాధ్యం కాని పక్షంలో వాణిజ్య శాఖలో పరిశ్రమల శాఖను కలిపే అవకాశాలున్నాయి. అదే విధంగా ఉపరితలరవాణాను షిప్పింగ్ను కలిపి ఒకే శాఖగా మార్పు చేయనున్నారు. పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలను కూడా విలీనం చేయవచ్చంటున్నారు. ఇక పట్టణాభివృద్ది మంత్రిత్వ శాఖలో గృహనిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలనను చేర్చవచ్చని భావిస్తున్నారు.
వెంకయ్య నాయుడును కేంద్రమంత్రివర్గంలో చేరాల్సిందిగా పార్టీ సహచరులు, శ్రేయోభిలాషులు ఒత్తిడి చేస్తున్నారు. వాజపేయి ప్రభుత్వంలో వెంకయ్య కేవలం 18 నెలలు మాత్రమే కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా చేశారు. ఒకసారి బిజెపి అధ్యక్ష పదవి నిర్వహించిన తర్వాత కేబినెట్లో చేరడంపై వెంకయ్య తటపటాయించినా, స్వయంగా పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ కేబినెట్లో చేరాలని భావిస్తుండటంతో వెంకయ్య కూడా కేబినెట్లో చేరడమే మంచిదని ఆయన మద్దతుదారులు సూచిస్తున్నారు.
టిడిపి అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వెంకయ్యను మంగళవారం రెండుసార్లు కలుసుకుని కేంద్ర మంత్రివర్గంలో కీలక బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరారని సమాచారం. కాగా, వెంకయ్యకు కర్ణాటక కోటాలో మంత్రి పదవి దక్కే అవకాశముంది.
టిడిపికి ఒక్కటే?
మోడీ కేబినెట్లో తెలుగుదేశం పార్టీకి దక్కే మంత్రి పదవులెన్ని అన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై ఇంత వరకూ ఎలాంటి సంకేతాలు వెలువడటం లేదు. అయితే, కేవలం 26 మందికే కేబినెట్ హోదా ఇవ్వాలని మోడీ భావిస్తుండటంతో టిడిపి ఒక్క కేబినెట్ బెర్త్తోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుందంటున్నారు. రెండో మూడో సహాయమంత్రి పదవులూ దక్కే అవకాశముందంటున్నారు.
ఒక స్వతంత్ర హోదా కల సహాయమంత్రిని కూడా తెలుగుదేశం కోరే అవకాశాలున్నాయని సమాచారం. 26న మోడీ ప్రమాణస్వీకారం చేస్తున్న నేపథ్యంలో 25న చంద్రబాబు బిజెపి నేతలతో తమకు కేటాయించే శాఖలపై చర్చించనున్నారు. ఈ మేరకు ఆయన 24 సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. మంత్రివర్గ కూర్పుపై బిజెపి నేతలతో చర్చించడంతోపాటూ మోడీ ప్రమాణస్వీకరాంలో పాల్గొని ఆయన తిరిగి వస్తారు.
కేవలం రెండు మంత్రి పదవులే ఇస్తే వాటిని సీమాంధ్రకు కేటాయించే అవకాశాలున్నాయని, ఎక్కువ వస్తే అప్పుడు తెలంగాణ నేతలకు అవకాశం లభించవచ్చని టిడిపి నేతలు అంటున్నారు. ప్రస్తుత తెలుగుదేశం ఎంపీల్లో సీనియర్ అయిన మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుకు కేబినెట్ హోదా దక్కే అవకాశాలున్నాయి. ఇంకా పలువురు సీనియర్ల పేర్లు పదవులు ఆశిస్తున్నారు.












Click it and Unblock the Notifications