మోడీ నన్ను అందుకే రెండుసార్లు తిట్టారు: ఉమా భారతి
బాధ్యతల నిర్వహణకు సంబంధించి తనను మోడీ ఏనాడూ ఒక్క మాట కూడా అనలేదని... అయితే తన అధిక బరువును ఉద్దేశించి మాత్రం రెండు సార్లు చివాట్లు పెట్టారని... బరువు తగ్గాలంటూ గట్టిగా చెప్పారని ఉమా భారతి తెలిపారు.
న్యూఢిల్లీ: కేంద్ర తాగునీరు, పారశుధ్యం శాఖ మంత్రి ఉమా భారతి తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా మొన్నటి దాకా బాధ్యతలను నిర్వహించిన ఉమాభారతికి ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో తాగునీరు, పారశుధ్యం శాఖలను ప్రధాని నరేంద్ర మోడీ అప్పగించిన సంగతి తెలిసిందే.
అయితే, జలవనరుల మంత్రిగా ఉమాభారతి సమర్థవంతంగా పనిచేయకపోవడం వల్లే ఆమెకు పోర్ట్ ఫోలియో మార్చారనే ప్రచారం జరగింది. ఇదే విషయం గురించి మీడియా ఆమెను ప్రశ్నించగా ఆమె ఆసక్తికర సమాధానమిచ్చారు.

బాధ్యతల నిర్వహణకు సంబంధించి తనను మోడీ ఏనాడూ ఒక్క మాట కూడా అనలేదని... అయితే తన అధిక బరువును ఉద్దేశించి మాత్రం రెండు సార్లు చివాట్లు పెట్టారని... బరువు తగ్గాలంటూ గట్టిగా చెప్పారని తెలిపారు. అందుకే తన శాఖను మార్చారని ఛమత్కరించారు. ఏదేమైనప్పటికీ గంగానది నుంచి తనను ఎవరూ దూరం చేయలేరని ఆమె అన్నారు.
పారిశుధ్య మంత్రిగా తాను ఇప్పుడు గంగానది చెంతనే ఉండి పని చేస్తానని ఉమా భారతి చెప్పారు. శాఖ మారినా కేంద్ర కేబినెట్ సమావేశాల్లో తన ఆలోచనలు పంచుకునే అవకాశం తనకు ఎప్పటికీ ఉంటుందని తెలిపారు. వచ్చే నెలలో తాను చేపట్టబోతున్న గంగా యాత్రకు అనుమతి ఇచ్చినందుకు మోడీకి కృతజ్ఞతలు తెలిపారు ఈ ఫైర్ బ్రాండ్.












Click it and Unblock the Notifications