ఎన్ఐసి సమావేశానికి మోడీ గైర్హాజర్: అల్లర్లపై పిఎం
న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్ సింగ్ సోమవారం ఏర్పాటు చేసిన జాతీయ భద్రతా మండలి (ఎన్ఐసి) సమావేశానికి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హాజరు కాలేదు. మత సామరస్యాన్ని పెంపొందించడానికి తీసుకోవాల్సిన చర్యలై, జాతీయ సమగ్రతలో సోషల్ నెట్వర్కింగ్ సైట్ల పాత్రపై ప్రధాని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.చత్తీస్గడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. రెండేళ్ల విరామం తర్వాత ఎన్ఐసి సమావేశం ఏర్పాటైంది.
మత కలహాలు అరికట్టేందుకు అందరూ కృషి చేయాలని ప్రధాని మన్మోహన్ సింగ్ కోరారు. సోమవారం ఉదయం ఢిల్లీలో జరుగుతున్న జాతీయ సమైక్యతా మండలి సమావేశంలో ప్రధాని మాట్లాడారు. మత సామరస్యం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ముజఫర్నగర్ అల్లర్ల తర్వాత జరుగుతున్న ఈ సమావేశానికి ప్రాధాన్యత ఉందని ఆయన తెలిపారు.

చిన్న చిన్న ఘటనలు అల్లర్లకు కారణమవుతున్నాయని ప్రధాని అన్నారు. ఈ ఏడాది హైదరాబాద్, కిష్టావర్, ఉత్తర్ప్రదేశ్లో ఉద్రిక్తతలు తలెత్తాయని, మతఘర్షణలకు కారణమైన వారిపై రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మన్మోహన్సింగ్ ఆదేశించారు. ముజఫర్నగర్ అల్లర్ల ఘటన విషాదకరమని ఆయన అన్నారు.
గత మూడేళ్లుగా దేశంలో మహిళలపై నేరాలు పెరిగాయని, మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. సోమవారం ఢిల్లీలో జరుగుతున్న జాతీయ సమైక్యతా మండలి సమావేశంలో షిండే మాట్లాడారు. దేశ అభివృద్ధిలో ఎస్సీ,ఎస్టీలను భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని షిండే తెలిపారు.












Click it and Unblock the Notifications