హైదరాబాద్‌కు వెళ్లాలంటే వీసా కావాల్సి వచ్చేది, ఈరోజు మర్చిపోలేరు: పటేల్ విగ్రహావిష్కరణలో మోడీ

Recommended Video

    పటేల్ విగ్రహం నవ భారతానికి ప్రతీక.. భావితరాలకు స్ఫూర్తి : మోదీ

    గాంధీనగర్: ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఉదయం ప్రపంచంలోనే ఎత్తైన ఉక్కు మనిషి సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పటేల్ స్మారకార్థం గుజరాత్‌లోని నర్మదా నది ఒడ్డున 'ఐక్యతా విగ్రహం-స్టాచూ ఆఫ్ యూనిటీ' పేరుతో నిర్మించిన విషయం తెలిసిందే. పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ జాతికి అంకితం చేశారు.

    ఈరోజు మరిచిపోలేరు

    అనంతరం పటేల్ 143వ జయంతి సందర్భంగా ఈ భారీ విగ్రహం వద్ద ప్రధాని మోడీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. పటేల్ దేశానికి వెల కట్టలేని సేవలందించారని అన్నారు. దేశ సమగ్రతకు కృషి చేసిన పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టమని అన్నారు. ఈ రోజును ఏ భారతీయుడూ మరిచిపోలేడని అన్నారు.

    కౌటిళ్యుడి వ్యూహం.. శివాజీ శౌర్యప్రతాపం..

    ఈ విగ్రహం ద్వారా ఒక వ్యక్తి సమైక్యతా సంకల్పం, దార్శనికత ప్రపంచానికి తెలుస్తుందని అన్నారు. దేశ సమగ్రతే ఆశ, శ్వాసగా ఉన్న ఉక్కు మనిషికి శతకోటి వందనాలు అని అన్నారు. కౌటిళ్యుడి వ్యూహం, శివాజీ శౌర్య ప్రతాపం మిళితమైన వ్యక్తి పటేల్ అని మోడీ కొనియాడారు.

    హైదరాబాద్‌కు వెళ్లాలంటే.. వీసా కావాల్సి వచ్చేది

    ఇవాళ భారత్ సమైక్యంగా ఉందంటే అది పటేల్ చలవేనని అన్నారు. పటేల్ లేకుంటే.. జునాగఢ్, హైదరాబాద్‌కు వెళ్లాలన్నా వీసా కావాల్సి వచ్చేదని అన్నారు. 562సంస్థానాలతో హైదరాబాద్ ను కూడా దేశంలో విలీనం చేసిన వ్యక్తి పటేల్ అని అన్నారు. ఆయనది, తమది ఒకటే లక్ష్యమని 'ఏక్ భారత్-శ్రేష్ట్ భారత్' అని మోడీ అన్నారు.

    సీఎంగా కన్న కల ప్రధానిగా సాకారం

    ‘గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి పటేల్‌ విగ్రహం ఏర్పాటుపై ఆలోచన చేశా. ప్రధాని అయ్యాక నా కల నెరవేరింది. ఈరోజు దేశమంతా ఉక్కు మనిషికి నివాళులర్పిస్తోంది. ప్రజలు ఐక్యతా పరుగులో పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. ఈ విగ్రహం ఏర్పాటుకు దేశవ్యాప్తంగా 2కోట్ల మంది రైతులు తమ వంతు సాయం చేశారు' అని మోడీ చెప్పారు.

    ఐకమత్యంతోనే.. లేదంటే మొహం చూపించుకోలేం

    ‘న‌ర్మ‌దా న‌ది తీరాన ఏర్పాటు చేసుకున్న ఈ మ‌హా విగ్ర‌హం ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్త‌యిన‌ది. భూమి పుత్రుడు స‌ర్దార్ ప‌టేల్ ఆకాశ‌మంత ఎత్తుకు ఎదిగిన వైనం మ‌న‌కు క‌నిపిస్తోంది. ఆయ‌న ఎల్ల‌ప్పుడూ మ‌న‌కు మార్గ‌ద‌ర్శ‌నం చేస్తూ, స్ఫూర్తిని అందిస్తూ వుంటారు. స‌ర్దార్ ప‌టేల్‌కు ఘ‌న నివాళి అర్పించేందుకు రూపొందిన ఈ మ‌హా విగ్ర‌హాన్ని వాస్త‌వ‌ రూపంలోకి తేవ‌డానికి రాత్రి ప‌గ‌లూ అనే తేడా లేకుండా ప‌ని చేసిన‌ వారంద‌రికీ నా అభినంద‌న‌లు. ఈ విశిష్ట‌మైన ప్రాజెక్టుకోసం పునాది రాయి వేసిన 2013 అక్టోబ‌ర్ నెల 31వ తేదీ నాకు గుర్తుకొస్తోంది. ఆ రోజున మొద‌లైన ఈ భారీ ప్రాజెక్టు రికార్డు టైములో పూర్త‌యింది. ఇది ప్రతి భార‌తీయునికి గ‌ర్వ‌కార‌ణ‌మైన విష‌యం. రాబోయే రోజుల్లో ఈ మ‌హా విగ్ర‌హాన్ని సంద‌ర్శించాల‌ని అంద‌రికీ విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. ఐక‌మ‌త్యానికి, మన మాతృ భూమి భౌగోళిక స‌మ‌గ్ర‌త‌కు, దేశ ప్రజల ఐకమత్యానికీ ఈ ఐక్య‌తా విగ్ర‌హం సంకేతంగా నిలుస్తోంది. అనైక్య‌త కార‌ణంగా విడిపోతే మ‌న‌కు మ‌న‌మే మొహం చూపించుకోలేమనీ, స‌మాధానం చెప్పుకోలేమనీ.. అదే క‌లిసి వుంటే ప్ర‌పంచాన్ని ధీటుగా ఎదుర్కోవచ్చుననే సందేశాన్ని ఈ విగ్ర‌హం అందిస్తోంది' అని మోడీ వ్యాఖ్యానించారు.

    పటేల్ అవిశ్రాంత శ్రమవల్లే..

    ‘ఆధునిక భార‌త‌దేశ నిర్మాత, మ‌హోన్న‌త ఐక్య‌తావాదికి ప్ర‌త్యేక నివాళి. 1947 ఆగ‌స్టు 15న భార‌త‌దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చింది. నూత‌న ప్ర‌స్థానం మొద‌లైంది. కానీ ఆ స‌మ‌యానికి జాతి నిర్మాణమ‌నేది సుదూరంగానే వుండిపోయింది.

    స్వాతంత్ర్యం వ‌చ్చిన త‌ర్వాత దేశానికి మొద‌టి హోం శాఖ మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు స‌ర్దార్ ప‌టేల్‌. ఆ వెంట‌నే ఆయ‌న ప‌రిపాల‌నాప‌ర‌మైన నియ‌మ నిబంధ‌నల త‌యారీకి ఒక వేదిక‌ను రూపొందించారు. రాష్ట్రాల వ్య‌వ‌హారాల‌ను చూసే విభాగం (స్టేట్స్ డిపార్ట్‌ మెంట్) ఏర్ప‌డింది.

    నాటికి దేశంలో గ‌ల 550కుపైగా సంస్థానాల‌తో సంప్ర‌దింపులు చేయ‌డ‌మే ఈ విభాగం ముఖ్య‌మైన ప‌ని. ప‌రిమాణం, జ‌నాభా, భౌగోళిక, ఆర్ధిక స్థితిగ‌తులు మొద‌లైన‌వాటి ప‌రంగా చూసిన‌ప్పుడు ఈ సంస్థానాలు వేటిక‌వే ప్ర‌త్యేకంగా ఉండేవి. స‌ర్దార్ ప‌టేల్ త‌న‌దైన శైలిలో వ్య‌వ‌హ‌రిస్తూ త‌న ప‌నిని ఎంతో ఖచ్చిత‌త్వంతో, దృఢంగా, ప‌రిపాల‌నాప‌ర‌మైన సామర్థ్యంతో నిర్వ‌హించారు. స‌మ‌యం చాలా త‌క్కువ‌. చేయాల్సిన ప‌ని బ్ర‌హ్మాండ‌మైన‌ది. కానీ ఆ ప‌నిని చేస్తున్న వ్య‌క్తి కూడా సామాన్యుడు కాదు.

    ఆయ‌న స‌ర్దార్ ప‌టేల్‌. భార‌త‌దేశం స‌మున్న‌తంగా నిల‌బ‌డాలన్న ఆకాంక్ష‌తో ప‌ని చేశారు. ఒక‌దాని త‌ర్వాత మ‌రొక‌టి...అప్ప‌టికి వున్న అన్నిసంస్థానాల‌తో స‌ర్దార్, ఆయ‌న బృంద స‌భ్యులు సంప్ర‌దింపులు జ‌రిపి...అన్నిటినీ భార‌త‌దేశంలో ఐక్యం చేశారు.స‌ర్దార్ ప‌టేల్ అవిశ్రాంతంగా ప‌ని చేయ‌డంవ‌ల్ల‌నే ఇప్పుడు మ‌నం చూస్తున్న భార‌త‌దేశ చిత్ర ప‌టం ఆ ఆకారంలో మ‌న‌కు క‌నిపిస్తోంది.' అని ప్రధాని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+