ఆస్పత్రిలో ఆక్సిజన్ లీకేజీ దుర్ఘటన: 24కు పెరిగిన మరణాలు -అందరూ కొవిడ్ రోగులే, రూ.5లక్షల పరిహారం
కరోనా విలయకాలంలో చోటుచేసుకున్న అత్యంత ఘోరమైనదిగా 'నాసిక్ ఆస్పత్రి ఆక్సిజన్ లీకేజీ' ఘటన నిలిచింది. అసలే కరోనా భీకరంగా వ్యాపించిన మహారాష్ట్రలోనే, అందునా కొవిడ్ ఆస్పత్రిలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం అందరినీ కలిచివేసింది. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా కేంద్రంలోగల డాక్టర్ జకీర్ నాయక్ మున్సిపల్ ఆస్పత్రిలో ఆక్సిజన్ లీకేజీ ఘటనలో చనిపోయినవారి సంఖ్య 24కు పెరిగింది.
జకీర్ నాయక్ ఆస్పత్రిలో 150 మంది కొవిడ్ రోగులు ఉండగా, వారిలో వీరిలో 23 మంది వెంటిలేటర్ సపోర్టు పైన, మిగిలినవారికి ఆక్సిజన్ సపోర్టు పైన చికిత్స పొందుతుండగా, బుధవారం మధ్యాహ్నం ఆస్పత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్ లో ఒక్కసారిగా గ్యాస్ లీకైంది. స్టోరేజీ ట్యాంకును భర్తీ చేస్తుండగా ఆక్సిజన్ లీక్ అయినట్టు వెల్లడైంది. ఈ దుర్ఘటనలో అప్పటికప్పుడే 22 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 11 మంది పురుషులు, 11 మంది మహిళలు ఉన్నారు. కాగా,

ఆక్సిజన్ లీకేజీ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన మరో ఇద్దరు కొవిడ్ రోగులు కూడా చనిపోయారని, దీంతో మొత్తం మరణాల సంఖ్య 24కు పెరిగిందని నాసిక్ జిల్లా కలెక్టర్ సూరజ్ మంధారే మీడియాకు తెలిపారు. ఈ ఘటనను అత్యంత సీరియస్ గా తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. ఆక్సిజన్ లీకేజీ వల్ల చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారాన్ని మహా సర్కారు ప్రకటించింది.

నాసిక్ ఆస్పత్రిలో ఆక్సిజన్ లీకేజీ దుర్భటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ మొదలు పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుంటుంబాలకు సంతాపాలు తెలిపారు. అసలే దేశంలో ఆక్సిజన్ కొరత కొనసాగుతుండగా, ఇలాంటి ఘటన జరగడం శోచనీయమని, దర్యాప్తులో అన్ని విషయాలు బయటికొస్తాయని నాసిక్ జిల్లా కలెక్టర్ అన్నారు.












Click it and Unblock the Notifications