షాక్: ములాయంను తప్పించి పార్టీ అధ్యక్షుడిగా అఖిలేష్, పార్టీ ఆఫీస్కు తాళం
సమాజ్వాది పార్టీలో మళ్లీ ముసలం పుట్టింది. ఆదివారం నాడు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ములాయం స్థానంలో ఎస్పీ జాతీయ అధ్యక్షులుగా అఖిలేష్ యాదవ్ను రాంగోపాల్ యాదవ్ ప్రకటించారు.
లక్నో: సమాజ్వాది పార్టీలో మళ్లీ ముసలం పుట్టింది. ఆదివారం నాడు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ములాయం స్థానంలో ఎస్పీ జాతీయ అధ్యక్షులుగా అఖిలేష్ యాదవ్ను రాంగోపాల్ యాదవ్ ప్రకటించారు. అమర్ సింగ్ను పార్టీ నుంచి తొలగిస్తూ, శివపాల్ యాదవ్ను రాష్ట్ర అధ్యక్షులుగా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అఖిలేష్ వర్గాన్ని పక్కన పెట్టి నాలుగు రోజుల క్రితం ములాయం ఎన్నికల్లో పోటీ చేసే వారి జాబితాను ప్రకటించారు. పోటీగా అఖిలేష్ యాదవ్ తన వర్గాన్ని మరుసటి రోజు ప్రకటించారు. దీంతో రెండు రోజుల క్రితం అఖిలేష్ యాదవ్ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించారు. ఆ తర్వాత శనివారం నాడు అంతా సద్దుమణిగినట్లు కనిపించినా, ఆదివారం మళ్లీ ముసలం వచ్చి పడింది.
పార్టీ కార్యాలయానికి తాళం
పార్టీ నుంచి యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ను తొలగించడం, కార్యకర్తల ఆందోళనతో వెంటనే తిరిగి పార్టీలోకి తీసుకోవడంతో విభేదాలు తాత్కాలికంగా సద్దుమణిగినట్లేనని భావించారు. కానీ ఆదివారం నాడు అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.
అఖిలేష్ను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్న అనంతరం రాంగోపాల్ యాదవ్ను ములాయం ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో, అఖిలేష్ మద్దతుదారులు లఖ్నవూలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి తాళం వేశారు. కార్యాలయంలోని శివపాల్ యాదవ్ నామఫలకాన్ని తొలగించారు. శివపాల్ యాదవ్ మద్దతుదారులు కూడా పార్టీ కార్యాలయం వద్దకు చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
తండ్రి స్థానంలో అఖిలేష్
ములాయం ఆదేశాలను బేఖాతరు చేస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ ఆదివారం పార్టీ కార్యవర్గ జాతీయ సదస్సును లక్నోలో నిర్వహించారు. ఈ సదస్సుకు సీఎం అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. తండ్రి ములాయం స్థానంలో ఎస్పీ జాతీయ అధ్యక్షుడి పగ్గాలను చేపట్టారు. ములాయం స్థానంలో పార్టీ జాతీయ అధ్యక్షులుగా అఖిలేష్ను ఎన్నుకున్నట్లు రాంగోపాల్ యాదవ్ ప్రకటించారు.
శివపాల్ యాదవ్ తొలగింపు, అమర్ సింగ్ పైన వేటు
అలాగే, శివపాల్ యాదవ్ను రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు శివపాల్ యాదవ్ తెలిపారు. అమర్ సింగ్ పైన వేటు వేశామన్నారు. ఈ మేరకు కార్యవర్గ సదస్సు నిర్ణయాలు తీసుకుందని తెలిపారు.
పార్టీ సమావేశంలో అఖిలేష్ యాదవ్ మాట్లాడారు.
ఈ ప్రభుత్వం మళ్లీ వద్దా కావాలా కార్యకర్తలు చెప్పాలని అడిగారు. ములాయంను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నాలుగు నెలల్లో పార్టీలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్నారు.
అమర్ సింగ్ లాంటి వాళ్లను పార్టీ నుంచి తొలగించాలని తాను చాలా రోజులుగా చెబుతున్నానని అన్నారు. పార్టీ శ్రేయస్సు దష్ట్యా ఈ రోజు పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. అయితే, తమకు ఇప్పటికీ ములాయం పైన విశ్వాసం ఉందన్నారు.
మా తండ్రీకొడుకుల బంధాన్ని విచ్ఛిన్నం చేయలేరు
పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు. తమ తండ్రీ, కొడుకుల బంధాన్ని ఎవరూ విచ్ఛిన్నం చేయలేరని చెప్పారు. రైతులు, యువకుల శ్రేయస్సు కోరే కొత్త ప్రభుత్వాన్ని తాము ఇస్తామని చెప్పారు. మళ్లీ అధికారంలోకి రాకూడదని కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వరుస ఉదంతాలతో పార్టీకి నష్టం జరుగుతోందన్నారు. ఎస్పీ తిరిగి అధికారంలోకి వస్తే ములాయం సంతోషిస్తారన్నారు.