వారేమైనా త్యాగమూర్తులా: సోనియాపై బిజెపి తీవ్రంగా..
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీలు త్యాగమూర్తులా లేక సమరయోధులా? అంటూ భారతీయ జనతా పార్టీ ఘాటుగా స్పందించింది.
కోర్టుకు సంబంధించిన అంశాన్ని రాజకీయం చేయవద్దని కాంగ్రెస్ పార్టీకి బిజెపి హితవు పలికింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు న్యాయస్థానానికి హాజరు కావడంపై కాంగ్రెస్ పార్టీ నేతల స్పందనల పట్ల బిజెపి తీవ్రంగా స్పందించింది.
ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని అవినీతి కేసులో నిందితులుగా కాకుండా సమరయోధులన్నట్లుగా చిత్రీకరిస్తుండడం తగదని పేర్కొంది. రోడ్ల పైకి వచ్చి నాటకాలు చేస్తూ అవినీతి కోసం నిస్సిగ్గుగా పోరాడుతున్నారని ఎద్దేవా చేసింది. ఇలా చేయడం దేశ చరిత్రలోనే మొదటిసారి అని నఖ్వీ మండిపడ్డారు.
అవినీతికి మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలు నిలిచిన తీరును దేశం యావత్తూ చూసిందన్నారు. నిజాయతీ లేనివారిని త్యాగమూర్తులుగా చిత్రీకరిస్తున్నారన్నారు. ఈ కేసులో ప్రభుత్వానికిగానీ, బిజెపికి గానీ ఎలాంటి సంబంధం లేదన్నారు.
కాంగ్రెస్, అవినీతి ఒకదానికోసం ఒకటి ఉన్నాయనీ, కాంగ్రెస్ రహిత భారతదేశమంటే దానర్థం అవినీతిరహిత భారత్ అన్నారు. భద్రత కారణాల రీత్యా అనేకమందికి ప్రభుత్వ బంగ్లాలు కేటాయిస్తుంటామనీ, ప్రియాంక గాంధీకి ఇచ్చినట్లే సుబ్రమణ్య స్వామికీ ఇచ్చామన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నా కాంగ్రెస్ ఇప్పటికీ అవినీతి రారాజుగా నిలుస్తోందన్నారు. కాంగ్రెస్ నేతల్ని ఎవరూ భయపెట్టడం లేదనీ, వారూ దేశాన్ని బెదిరించే ప్రయత్నాలను మానుకుని, కేసులోని మంచిచెడ్డలకు కట్టుబడి ఉండాలన్నారు. తమది రాజకీయ ప్రతీకారం కాదని కేంద్రమంత్రి పియూష్ గోయెల్ అన్నారు.
రాజకీయ పక్షాలు వసూలు చేసిన నిధుల్ని రాజకీయ అవసరాల నిమిత్తమే వినియోగించాలని, ప్రయివేటు అవసరాల కోసం ఈ నిధుల్ని మళ్లించాలని ఎవరైనా భావిస్తే దానిని రాజకీయ ప్రతీకారమని ఎలా చెప్తారని ప్రశ్నించారు. సుబ్రహ్మణ్య స్వామి వ్యక్తిగత హోదాలో ఫిర్యాదు చేశారని, ఆన ఫిర్యాదుతో బిజెపికి సంబంధం లేదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.