నేషనల్ హెరాల్డ్ కేసు: అసలేంటీ ఈ గొడవ?
న్యూఢిల్లీ: 'దివంగత ప్రధాని ఇందిరా గాంధీ కోడలిని.. ఎవరికీ భయపడను' నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ పైవిధంగా స్పందించారు. అంతేకాదు రాజకీయ దురుద్దేశంతోనే ఎన్డీఏ ప్రభుత్వం తమపై ఈ కేసును ఎగదోసిందని సోనియా, రాహుల్లు మంగళవారం ఆరోపించారు.
దీంతో దేశ వ్యాప్తంగా ఈ నేషనల్ హెరాల్డ్ కేసు మరోసారి చర్చకు వచ్చింది. అసలీ నేషనల్ హెరాల్డ్ కేసు ఏంటీ, బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి ఎందుకు సోనియా, రాహుల్పై నిధుల దుర్వినియోగం కింద పిటిషన్ పైల్ చేశారో తెలుసుకుందాం. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1938లో అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ (ఏజెఎల్) కంపెనీని కాంగ్రెస్ పార్టీ సొంత నిధులతో స్ధాపించారు.
ఈ కంపెనీ స్థాపించిన మూడు పత్రికలలో నేషనల్ హెరాల్డ్ ఒకటి. స్వాతంత్ర్య పోరాట సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికార పత్రికగా ఉండేది. ఆ తర్వాత దశాబ్ధాలుగా నష్టాల్లో కూరుకుపోవడంతో 2008 ఏప్రిల్ 1న దీనిని మూసివేశారు. ఆ తర్వాత అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ కంపెనీ రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టింది. ఢిల్లీ, లక్నో, ముంబై వంటి నగరాల్లో ఎంతో విలువైన భూములను సంపాదించింది.
ఆ తర్వాత 2010లో 'యంగ్ ఇండియా లిమిటెడ్' అనే సంస్ధను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఈ కంపెనీలో వీరిద్దరికి కలిపి 76 శాతం షేర్లు ఉన్నాయి. మిగతా 34 శాతం వాటాను ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ కోశాధికారి మోతీలాల్ వోరా, ప్రధాన కార్యదర్శి ఆస్కార్ ఫెర్నాండేజ్, సుమన్ దూబే, శ్యాం పిట్రోడాలు కలిగి ఉన్నారు.
ఈ యంగ్ ఇండియా కంపెనీ ద్వారా రూ. 5వేల కోట్ల ఆస్తులున్న అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ను రూ. 50 లక్షలకే స్వాధీనం చేసుకుంది. ఈ స్వాధీన ప్రక్రియలో నేషనల్ హెరాల్డ్ పత్రికకు చెందిన రూ.2,000 కోట్లను దుర్వినియోగం చేశారంటూ సోనియా, రాహుల్లపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి 2014లో పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు నేషనల్ హెరాల్డ్కు ఇచ్చిన వడ్డీరహిత రుణం రూ. 90.25 కోట్లను యంగ్ ఇండియా లిమిటెడ్ (వైఐఎల్)కు ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చిందని హైకోర్టు న్యాయమూర్తి సునీల్ గౌర్ ప్రశ్నించారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ పార్టీ కోశాధికారి మోతీలాల్ వోరా, ప్రధాన కార్యదర్శి ఆస్కార్ ఫెర్నాండేజ్, సుమన్ దూబే, శ్యాం పిట్రోడా, యంగ్ ఇండియా లిమిటెడ్కు కింది కోర్టు విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
నిధుల దుర్వినియోగం కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపుతో పాటు ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలన్న సోనియా, రాహుల్ గాంధీ పిటిషన్లను సోమవారం ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో మంగళవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, కోర్టు మరోసారి వారికి అవకాశం ఇచ్చింది. ఈ నెల 19న కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. కేవలం నాలుగు నిమిషాల్లోనే ఢిల్లీలోని పాటియాలా కోర్టు మంగళవారం తీర్పును వెల్లడించిన సంగతి తెలిసిందే.