నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్కు ఊరట
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఊరట లభించింది. సోనియా, రాహుల్ సహా ఐదుగురికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో జారీ అయిన సమన్లను కొట్టివేయడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సోనియా, రాహుల్లు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. వారి తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.
వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకుర్, జస్టిస్ ఆర్ భానుమతిలతో కూడిన ధర్మాసనం సోనియా, రాహుల్ సహా ఐదుగురికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. హైకోర్టు పరిధి దాటి ఆదేశాలు ఇచ్చిందని వ్యాఖ్యానించింది.