సోనియా, రాహుల్లపై ఈడి ప్రాథమిక దర్యాప్తు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె తనయుడు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై వచ్చిన ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) దృష్టి సారించింది. ఆ ఆరోపణల్లో వాస్తవాలను తెలుసుకునేందుకు ప్రాథమిక దర్యాప్తు చేపట్టింది.
నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులకు సంబంధించి నెహ్రూ, గాంధీ కుటుంబం నిబంధనలను ఉల్లంఘించిందంటూ బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి కేసు దాఖలు చేశారు. యంగ్ ఇండియా అనే పత్రికకు కాంగ్రెస్ పార్టీ రూ. 90 లక్షలు రుణం ఇచ్చిన విషయాన్ని సుబ్రహ్మణ్యస్వామి తన పిర్యాదులో ప్రస్తావించారు.
నిజానికి పార్టీలు ప్రైవేట్ సంస్థలకు రుణాలు ఇవ్వడం చట్టరీత్యా నేరం. దాంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ) రంగంలోకి దిగింది. నేరం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలితే కేసు నమోదు చేసేందుకు ఈడీ సిద్ధమవుతోంది.
కేసు నమోదు చేయడానికి వీలుందా, లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి ఈడి ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించింది. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత బిజెపి ప్రభుత్వం వేధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెసు విమర్శిస్తోంది.