కేంద్రం ఫెయిల్.. మరో లాక్డౌన్ అనివార్యం.. ప్రధానికి రాహుల్ '4' అత్యవసర సూచనలు...
దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ పెట్టాల్సిన అనివార్య పరిస్థితులు కనిపిస్తున్నాయని... వైరస్ కట్టడిలో ప్రభుత్వం వైఫల్యం చెందడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రానికి స్పష్టమైన,సమగ్రమైన వ్యూహమేదీ లేకపోవడం వల్లే దేశం ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టబడిందన్నారు.ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన ఆయన... నాలుగు కీలక అంశాలను ప్రస్తావించారు. కరోనాపై పోరుకు ఆ 4 అంశాలు దోహదపడుతాయని చెప్పారు.
Recommended Video

ఆ నాలుగింటిని పాటించాలని...
దేశంలో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరిష్కరించాల్సిన సమస్యలు నాలుగు ఉన్నాయని... వాటిని పరిష్కరించడం ద్వారా కరోనాను కట్టడి చేయవచ్చునని ప్రధానికి రాహుల్ సూచించారు. 1) దేశవ్యాప్తంగా వైరస్,మ్యుటేషన్స్ వ్యాప్తిని జీనోమ్ సీక్వెన్స్,డిసీజ్ పాటర్న్స్ నమూనాల ద్వారా శాస్త్రీయంగా గుర్తించాలి. 2)కొత్తగా పుట్టుకొస్తున్న మ్యుటేషన్లపై అన్ని వ్యాక్సిన్లను ప్రయోగించి వాటి సామర్థ్యాన్ని పరీక్షించాలి. 3) దేశ జనాభా మొత్తానికి వేగవంతంగా వ్యాక్సినేషన్ ఇవ్వాలి. 4) కరోనా లెక్కల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి. ఈ నాలుగు సూచనలను రాహుల్ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

ప్రజలే మీ ప్రాధాన్యత కావాలి : మోదీ
దేశంలో కోవిడ్ సృష్టిస్తున్న వినాశకర పరిస్థితుల నేపథ్యంలో ప్రధానికి తాను ఈ లేఖ రాస్తున్నట్లు రాహుల్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ మొదటి ప్రాధాన్యత ప్రజలే అయి ఉండాలని ప్రధాని మోదీకి రాహుల్ సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు సర్వ శక్తులు ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు. భారత్లో ఉన్న జన్యు వైవిధ్యం,సంక్లిష్టతల కారణంగా ఇక్కడ వైరస్ అత్యంత వేగంగా మ్యుటేట్ అవుతోందని చెప్పారు. తద్వారా అది మరింత ప్రమాదకరంగా మారుతున్నట్లు చెప్పారు.

రాహుల్ హెచ్చరిక...
ఇప్పుడు మనం చూస్తున్న డబుల్ మ్యుటెంట్,ట్రిపుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్స్ కేవలం ఆరంభ దశ మాత్రమేనని తాను భయాందోళన చెందుతున్నట్లు రాహుల్ తెలిపారు. వైరస్ వ్యాప్తిని ఇలాగే వదిలేస్తే అది కేవలం మన దేశానికే కాక ప్రపంచానికే వినాశనకర పరిస్థితులను తీసుకొస్తుందని హెచ్చరించారు. ఓవైపు వైరస్ వ్యాప్తి కొనసాగుతుండగానే కరోనాపై పోరులో విజయం సాధించామని ప్రకటించి అతివిశ్వాసాన్ని ప్రదర్శించడం భారత్ను మరింత ప్రమాదంలోకి నెట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం భారత్లో మరో లాక్డౌన్ను అనివార్యం చేసిందన్నారు.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకోవాలని...
దేశంలో లాక్డౌన్ విధిస్తే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని... లాక్డౌన్ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రజల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని ప్రధానికి రాహుల్ సూచించారు. ఆహారం,ఆర్థిక చర్యలు,రవాణా సౌకర్యాల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలన్నారు. లాక్డౌన్తో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం భావిస్తోందని... కానీ వైరస్ కారణంగా సంభవిస్తున్న ప్రాణ నష్టాలను ఇలాగే వదిలిస్తే భవిష్యత్తులో మరింత విషాదకర పరిస్థితులు తప్పవని అన్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు అన్ని వర్గాలను కలుపుకుని ముందుకెళ్లాలని... ఇందుకు కాంగ్రెస్ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ అత్యవసర సలహాలు సూచనలను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications