వివేకానందుడన్నారు.. నేనూ: ఒబామా నమస్తే, మిచెల్లీ మంచి డ్యాన్సర్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఢిల్లీలోని సిరి ఫోర్టు స్టేడియంలో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు. భారత్, అమెరికా దేశాలు సహజమిత్రులన్నారు. సామాజిక మాధ్యమాలతోనే మన బంధం మరింత బలపడిందన్నారు. చంద్రుడు, అంగారకుడిని చేరిన కొన్ని దేశాల్లో భారత్, అమెరికా ఉన్నాయని చెప్పారు. ఇరు దేశాల అభ్యున్నతి కోసం స్నేహహస్తం అందిస్తున్నట్లు చెప్పారు.
భారత దేశంలో ప్రతి ఒక్కరు బ్యాంకు ఖాతా పొందేలా అమెరికా సహకరిస్తుందని హామీై ఇచ్చారు. రైతుల ఆదాయం పెంచేందుకు కూడా సహకరిస్తామన్నారు. మౌలిక వసతుల అభివృద్ధికి సహకరించేవారిలో అమెరికా ముందుంటుందన్నారు. భారత సంస్కృతి, ప్రజారోగ్య పరిరక్షణలో భాగస్వామ్యముంటుందన్నారు. అణ్వస్త్రరహిత ప్రపంచం కోసం అమెరికా కృషి చేస్తోందని, మయన్మార్, శ్రీలంక, దక్షిణాసియా దేశాలకు భారత్ సహకరించాలన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో ముందుంటే, ఆ దేశం కూడా విజయవంతంగా దూసుకు పోతుందన్నారు. క్లీనర్ ఎనర్జీ నీడ్స్ కోసం అమెరికా సహకరిస్తుందన్నారు.
ఈసారి డ్యాన్స్ చేయలేకపోయాం
ఇంతకుముందు తాము ముంబైలో పిల్లలతో కలిసి డ్యాన్స్ చేశామని, ఈసారి చేయలేకపోయామని ఒబామా అన్నారు. మిచెల్ ఒబామా మంచి డ్యాన్సర్ అని చెప్పారు. ఇంతకుముందు శ్వేతసౌధంలో దీపావళి జరుపుకున్నట్లు తెలిపారు. మహాత్ముడి స్ఫూర్తితోనే మార్టిన్ లూథర్ కింగ్ పోరాటం చేశారన్నారు. అంహింస అత్యంత శక్తిమంతమైనదన్నారు. ఇది అందరికీ అనుసరణీయమన్నారు.
వందేళ్ల క్రితం స్వామి వివేకానంద అమెరికాకు వచ్చి స్ఫూర్తివంతమైన ప్రసంగం చేశారని చెప్పారు. ఆయన తమ సొంత నగరం చికాగోకి వచ్చారని, సోదరసోదరీమణులారా అంటూ ప్రసంగం ప్రారంభించారన్నారు. ఇప్పుడు తాను కూడా భారత్లోని సోదర సోదరీమణులారా అని అంటున్నానన్నారు. ఆయన భారతీయతను, దాని శక్తిని చాటారన్నారు.
వలసవాదానని తరిమికొట్టడానికి మనమంతా పోరాడాలని, భారత, అమెరికా సంబంధాలు అత్యున్నతస్థాయికి చేరుకున్నాయన్నారు. టెక్నాలజీ శక్తి మీ సొంతమని, దాని పుణ్యమా అని ఫేస్బుక్, ట్విట్టర్ తదితరాల సాయంతో ప్రపంచంలోని అందరినీ కలవగల్గుతున్నామన్నారు. 30 లక్షల మంది భారతీయులు అమెరికాను బలోపేతం చేయడం గర్వకారణమన్నారు.
బరాక్ ఒబామా సిరిఫోర్టు స్టేడియంలో యువత, సామాజిక కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన తన ప్రసంగాన్ని నమస్తే అంటూ ప్రారంభించారు. బహుత్ బహుత్ ధన్యవాద్ అని కూడా అన్నారు. బరాక్ ఒబామా పర్యటన ఈ రోజుతో ముగియనుంది.
గార్డ్ ఆఫ్ హానర్గా గణతంత్ర దినోత్సవంలో ఓ యువతి ఉండటం గర్వకారణమని, మహిళల శక్తి దేశానికి శక్తి అన్నారు. తన తాత కెన్యాలోని బ్రిటిష్ ఆర్మీలో వంటవాటిగా పని చేసేవాడని గుర్తు చేసుకున్నారు. యూఎన్ఎస్సీలో భారత్కు శాశ్వత సభ్యత్వం కోసం తాను ప్రయత్నిస్తానని చెప్పారు. యువత సాధికారతతో దేశం ముందుకు పోతుందన్నారు. మిల్కా సింగ్, మేరీ కోమ్, కైలాష్ సత్యార్థిలు భారతదేశానికి గర్వకారణమన్నారు.