లోకసభకు పోటీ చేస్తున్న నవనీత్ కౌర్కి సినిమా కష్టాలు
ముంబై: ప్రముఖ నటి నవనీత్ కౌర్ రానున్న సార్వత్రిక ఎన్నికలలో నేషనలిస్ట్ కాంగ్రెసు పార్టీ (ఎన్సీపి) తరఫున అమరావతి లోకసభ స్థానం నుండి బరిలో నిలిచారు. ఆమె అమరావతి బరిలో నిలిచినప్పటికీ ఆమెకు సినిమా కష్టాలు వచ్చి పడుతున్నాయి.
అమరావతి లోకసభ స్థానం ఎస్సీలకు రిజర్వు చేసినది కావడంతో నవనీత్ కౌర్ ఎస్సీ కాదంటూ టికెట్ కోసం ప్రయత్నాలు చేసిన సంజయ్ ఖోడ్కే మొదట విమర్శలు గుప్పించారు. ఆ గండం నుండి నవనీత్ కౌర్ బయటపడ్డారు.
ఎన్సీపి ముఖ్య నాయకులు జోక్యం చేసుకొని సంజయ్ ఖోడ్కోకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యనేతలు అంతా నవనీత్ కౌర్ వైపు నిలబడ్డారు.
ఇంట గెలిచిన నవనీత్ కౌర్కు బయటి కష్టాలు కూడా వచ్చాయి. నవనీత్ కౌర్ నామినేషన్తో పాటు సమర్పించిన కుల ధ్రవీకరణ పత్రం నకిలీదని ఆరోపిస్తూ కొందరు సామాజిక కార్యకర్తలు న్యాయస్థానానికి వెళ్లారు. కోర్టులోను, ప్రజా కోర్టులోను నవనీత్ కౌర్ ఏ మేరకు నెగ్గుకు వస్తుందో చూడాలి.
కాగా, నవనీత్ కౌర్ను ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకుడి నుండి గత నెలలో వేధింపులు వచ్చిన విషయం తెలిసిందే. సదరు నాయకుడు ఆమె అసభ్యకర ఫోటోలు నెట్లో కూడా పెట్టినట్లు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి ఆమె పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు.