మోడీకి ఫోన్ చేసిన నవాజ్ షరీఫ్: హామి
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీకి మంగళవారం సాయంత్రం పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఫోన్ చేసి మాట్లాడారు. పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రదాడి కేసుకు పూర్తిగా సహకరిస్తామని నవాజ్ షరీఫ్ హామీ ఇచ్చారు.
పఠాన్ కోట్ లో ఉగ్రవాదులు దాడులు చేసిన తరువాత పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చెయ్యడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ కేసు దర్యాప్తుకు ఎలా సహకరిస్తారు అనే విషయం వేచి చూడాలి.
శనివారం వేకువ జామున పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో చొరబడిన ఉగ్రవాదులు సైనికుల మీద దాడికి దిగారు. సుమారు 80 గంటల పాటు భారత్ భద్రతా దళాలు, ఉగ్రవాదుల మద్య కాల్పులు జరిగాయి.
ఈ ఆపరేషన్ లో ఆరు మంది ఉగ్రవాదులు అంతం అయ్యారు. ఏడుగురు సైనికులు బలి అయ్యారు. సుమారు 20 మంది భద్రతా సిబ్బందికి గాయాలైనాయి. పఠాన్ కోట్ ఉగ్రదాడితో భారత్-పాక్ దేశాల మధ్య చర్చల పునరుద్ధరణపై సందిగ్ధం నెలకొంది.