వాహనాలు బూడిద చేసిన నక్సల్స్
రాయ్ పూర్: చత్తిస్ గడ్ లోని నారాయణ్ పూర్ జిల్లాలో నాలుగు టిప్పర్ వాహనాలకు నక్సలైట్లు నిప్పంటించారు. అక్కడ పని చేస్తున్న సిబ్బంది పారిపోవడంతో పోలీసులు వచ్చేలోపు నక్సల్స్ అక్కడి నుండి వెళ్లి పోయారు.
నారాయణ్ పూర్- ఓర్చా మార్గం మధ్యలో ఓ ప్రయివేటు కంపెనీ నిర్వహకులు రోడ్డు పనులు చేస్తున్నారు. కొంతకాలం నుండి ఇక్కడ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పరిసర ప్రాంతాలలో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉంది.
సోమవారం వేకువ జామున 20 మంది నక్సల్స్ తుపాకులు చేతపట్టుకుని రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతంలోకి వెళ్లారు. ఆదివారం రాత్రి పనులు పూర్తి చేసిన సిబ్బంది టిప్పర్ వాహనాలు రోడ్డు పక్కన నిలిపి వెళ్లిన విషయం గుర్తించారు.
నాలుగు టిప్పర్ వాహనాలకు నిప్పంటించారు. విషయం గుర్తించిన ప్రయివేటు కంపెనీ సిబ్బంది అక్కడి నుండి పరారైనారు. తరువాత నక్సల్స్ నినాదాలు చేసుకుంటు అక్కడి నుండి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అడిగినంత చందాలు ఇవ్వకపోవడం వలనే నక్సల్స్ ప్రయివేటు కంపెనీ వాహనాలకు నిప్పంటించి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. భయంతో కార్మికులు పని చెయ్యడానికి ముందుకు రాకపోవడంతో రోడ్డు పనులను తాత్కాలికంగా నిలిపివేశారు.