లోకసభలో తీర్మానాలు: మేలోనే ఎన్నికలని కమల్నాథ్
న్యూఢిల్లీ: సీమాంధ్ర ప్రాంత పార్లమెంటు సభ్యుల అవిశ్వాస తీర్మానం నోటీసులను సభాపతి మీరా కుమార్ బుధవారం పరిగణలోకి తీసుకున్నారు. సీమాంధ్ర కాంగ్రెసు, సీమాంధ్ర తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు వేర్వేరుగా ఇచ్చిన మూడు అవిశ్వాస తీర్మానాలను స్పీకర్ పరిగణలోకి తీసుకున్నారు.
షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు: కమల్నాథ్
యూపిఏ ప్రభుత్వంపై సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానానికి తగిన సంఖ్యాబలం లేదని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కమల్నాథ్ అన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని సభలో ఓడిస్తామని చెప్పారు. షెడ్యూలు ప్రకారమే సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఎన్నికలు మే నెలలోనే జరుగుతాయన్నారు. ఇప్పటికిప్పుడు ఏ పార్టీ ఎన్నికలకు సిద్ధంగా లేదన్నారు.
ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం జరిగనా అదంతా వట్టిదే అన్నారు. యూపిఏ ప్రభుత్వం పూర్తికాలం కొనసాగుతుందన్నారు. ప్రభుత్వానికి మెజార్టీ ఉందని, అవిశ్వాస తీర్మానం నెగ్గే అవకాశం లేదన్నారు. సీమాంధ్ర కాంగ్రెసు ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెట్టడం అసాధారణమని, బాధాకరమైన విషయమన్నారు. అవిశ్వాసం పార్లమెంటులో ఖచ్చితంగా ఓడుతుందన్నారు.
అంతకుముందు కాంగ్రెసు అధికార ప్రతినిధి పిసి చాకో మాట్లాడుతూ... పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం వీగిపోతుందన్నారు. ఆరుగురు ఎంపీలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, వారిపై వేటు వేయడం ఖాయమని చెప్పారు. మరో మూడు, నాలుగు నెలల్లో సాధారణ ఎన్నికలు ఉన్నందున ఏ పార్టీ కూడా ముందస్తు ఎన్నికలను కోరుకోవడం లేదన్నారు. ఎంపీలు ఎందుకు అవిశ్వాసం నోటీసు ఇచ్చారో అర్థం కావడం లేదన్నారు.
ఢిల్లీలో హీట్
అవిశ్వాస తీర్మానం నోటీసుల నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయం వేడెక్కింది. క్షణం క్షణం రాజకీయాలు మారుతున్నాయి. అవిశ్వాసానికి ఎవరు మద్దతిస్తారో, ఎవరు వ్యతిరేకంగా ఉంటారో పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి.