అజిత్ పవార్ ఫోన్ స్విచ్డ్ ఆఫ్..నేతల్లో టెన్షన్: టచ్ లోనే ఉన్నారంటోన్న ఎన్సీపీ
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరోసారి పార్టీ నేతలను ఆందోళనలోకి నెట్టారు. గురువారం ఉదయం నుంచి ఆయన ఫోన్ స్విచ్డ్ ఆఫ్ లో ఉందని, పార్టీ నేతలతో ఎవ్వరితోనూ అందుబాటులో లేరనే వార్తలు ఒక్కసారిగా గుప్పమన్నాయి. మరి కొన్ని గంటల్లో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ మహా వికాస్ అఘాడీ కూటమి అధినేత ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా.. అజిత్ పవార్ అందుబాటులో లేకపోవడం ఎన్సీపీ నేతలను ఆందోళనకు గురి చేసింది.

సొంత గూటికి చేరుకున్నా.. ఆ పదవి దక్కదనే?
మొదట- మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వంలో ఎన్సీపీ తరఫున అజిత్ పవారే ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాల్లో ఆయన భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడం, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించడం, ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం.. చకచకా సాగిపోయాయి. తాజాగా ఆయన తన పదవికి రాజీనామా చేసి, సొంత గూటికి చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవిని ఆయన ఆశిస్తున్నారు.

అజిత్ స్థానంలో జయంత్ పాటిల్..
పార్టీ ఫిరాయించి, రాత్రికి రాత్రి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించినందున కూటమి తరఫున అజిత్ పవార్ పేరును ఉప ముఖ్యమంత్రి పదవి జాబితా నుంచి తొలగించింది ఎన్సీపీ. ఆయన స్థానంలో పార్టీ సీనియర్ నాయకుడు జయంత్ పాటిల్ పేరును తెర మీదికి తీసుకొచ్చింది. బీజేపీ సర్కార్ కుప్పకూలిపోవడానికి కారణమైన అనంతరం అజిత్ పవార్ సొంత గూటికి చేరుకున్నారు. తన పదవి తనకు దక్కాల్సిందేనంటూ భీష్మించారు.

ఉప ముఖ్యమంత్రి పదవిపై హామీ ఇవ్వని శరద్ పవార్..
దీనిపై పార్టీ అధినేత శరద్ పవార్ నుంచి ఎలాంటి హామీ లభించలేదు. ఫలితంగా- ఆయన అలకపూనారని అంటున్నారు. అందుకే- ఫోన్ స్విచ్డ్ ఆఫ్ చేసుకుని, అజ్ఞాతంలోకి వెళ్లారనే వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలను ఎన్సీపీ అధికార ప్రతినిధి తోసి పుచ్చారు. ఆయన ఉద్దేశపూరకంగానే ఫోన్ స్విచ్డ్ ఆఫ్ చేసుకున్నారని, తమతో అందుబాటులోనే ఉన్నారని చెబుతున్నారు. ఈ ఉదయం ఆయనే ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేసి, తాను సెల్ ఫోన్ స్విచ్డ్ ఆఫ్ చేస్తున్నట్లు తెలిపారని చెప్పారు.

బీజేపీ నాయకుల నుంచి అభ్యంతర కాల్స్..
బీజేపీ ప్రభుత్వం మూడు రోజుల్లోనే కుప్పకూలిపోవడానికి కారణమైనందున.. బీజేపీ అభిమానులు ఆయనను తిడుతూ ఫోన్లు చేస్తున్నారని, అందువల్లే స్విచ్డ్ ఆఫ్ చేశారని వివరణ ఇస్తున్నారు. బీజేపీ నాయకుల నుంచి అజిత్ పవార్ కు వరుసగా అభ్యంతరక ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెబుతున్నారు. వాటిని స్వీకరించడం ఇష్టం లేక ఫోన్ స్విచ్డ్ ఆఫ్ లో ఉంచినట్లు ఎన్సీపీ అధికార ప్రతినిధి తెలిపారు. శివాజీ పార్కులో ఏర్పాటు కాబోతోన్న ఉద్దవ్ థాకరే ప్రమాణ స్వీకారానికి అజిత్ పవార్ హాజరవుతారని స్పష్టం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ పేరు ఖరారైందా? లేదా? అనే విషయం ఇంకా తేలాల్సి ఉందని అన్నారు.












Click it and Unblock the Notifications