అజిత్ పవార్ కమ్ బ్యాక్ ఖాయమా?: అజిత్ దాదా వుయ్ లవ్ యూ అంటూ ఎన్సీపీ కార్యకర్తల ప్లకార్డులు
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సొంత గూటికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మంగళవారం మధ్యాహ్నం తన ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయనను తిరిగి పార్టీలోకి చేర్చుకోవడానికి ఎన్సీపీ అగ్ర నాయకత్వం సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. అజిత్ పవార్ తమ కూటమి నాయకుడేనని, ఆయన వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ సైతం ప్రకటించిన విషయం తెలిసిందే.

లాంఛనప్రాయమేనా?
ఈ నేపథ్యంలో అజిత్ పవార్ శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమిలో చేరడం ఇక లాంఛనప్రాయమేనని అంటున్నారు. దీనికి అనుగుణంగా.. ఎన్సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా అజిత్ పవార్ ను పార్టీలో చేర్చుకోవాలనే తమ నిర్ణయాన్ని ప్లకార్డుల ద్వారా ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి నాయకులు ముంబైలోని ట్రైడెంట్ హోటల్ లో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలోనే అజిత్ పవార్ శివసేన సారథ్యంలోని కూటమిలో పున: ప్రవేశించే అవకాశం ఉందని తెలుస్తోంది.

అజిత్ పవార్ కు అనుకూలంగా ప్లకార్డులతో ఎన్సీపీ కార్యకర్తలు..
శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హోటల్ బయట సందడి చేస్తూ కనిపిస్తున్నారు. అజిత్ దాదా వుయ్ లవ్ యూ అనే అక్షరాలను రాసిన ప్లకార్డులను వారు ప్రదర్శిస్తున్నారు. అజిత్ పవార్ ను వెంటనే పార్టీలోకి చేర్చుకోవాలంటూ వారు నినాదాలు చేస్తున్నారు. ఆయన బీజేపీకి మద్దతు ఇవ్వడం ఒకరకంగా మంచిదే అయిందని వ్యాఖ్యానిస్తున్నారు. తెలిసో, తెలియకో అజిత్ పవార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీకి మద్దతు ఇచ్చారని చెబుతున్నారు. ఆయన ఇలా చేయడం వల్ల బీజేపీ నిజస్వరూపం బట్టబయలైందని వారు స్పష్టం చేస్తున్నారు.

టచ్ లోకి రావట్లేదంటూ..
ఈ సమావేశానికి అజిత్ పవార్ హాజరు కాకపోవచ్చని ఎన్సీపీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే జయంత్ పాటిల్ వెల్లడించారు. రెండు రోజులుగా తాను ఆయనతో సంప్రదింపులు నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఆయన అందుబాటులో రావట్లేదని అన్నారు. బహుశా పార్టీని వీడి తప్పు చేశాననే ఆత్మన్యూనతా భావనలో ఆయనలో వ్యక్తమౌతూ ఉండొచ్చని, అందుకే తమతో మాట్లాడట్లేదని చెప్పారు. మంగళవారం కూడా తాను అజిత్ పవార్ ను సంప్రదించడానికి ప్రయత్నించానని జయంత్ పాటిల్ తెలిపారు.

ట్రైడెంట్ హోటల్ లో కూటమి నేతల భేటీ..
ఇదిలావుండగా.. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి నాయకులు ఒక్కరొక్కరుగా ముంబై ట్రైడెంట్ హోటల్ కు చేరుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ఎంపికైన శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే తన భార్య రష్మీ థాకరే, కుమారుడు, ఎమ్మెల్యే ఆదిత్య థాకరేలతో కలిసి హోటల్ కు చేరుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లికార్జున ఖర్గె, అశోక్ చవాన్, పృథ్వీరాజ్ చవాన్, ఎన్సీపీ సీనియర్ నేతలు శరద్ పవార్, ప్రఫుల్ పటేల్ తదితరులు హోటల్ కు చేరుకున్నారు.












Click it and Unblock the Notifications