ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము నామినేషన్-మోడీ, షా సహా ప్రముఖుల హాజరు
ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపికైన జార్ఖండ్ గవర్నర్ ద్రౌపదీ ముర్ము ఇవాళ పార్లమెంటులోని సచివాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఆమె తరఫున నాలుగు సెట్ల నామినేషన్లను బీజేపీ నేతలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, బీజేపీ నేతలతో పాటు వైసీపీ, ఇతర పార్టీల నుంచి ఎంపీలు కూడా హాజరయ్యారు.
ఎన్డీయే అభ్యర్ధిగా రంగంలోకి దిగిన ద్రౌపదీ ముర్ముకు మద్దతుగా ప్రధాని మోడీ, అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఇవాళ తరలివచ్చారు. ముర్ముతో పాటు పార్లమెంటు సచివాలయానికి వచ్చిన వీరంతా నామినేషన్ దాఖలు చేసే వరకూ అక్కడే ఉన్నారు. ముర్ము నామినేషన్ పత్రాలపై ప్రధాని మోడీ సహా మరికొందరు సంతకాలు చేశారు. అధికారిక లాంఛనాలు పూర్తి చేసే వరకూ అక్కడే ఉన్న ప్రముఖులు అనంతరం తిరిగి వెళ్లారు.
ద్రౌపదీ ముర్ము నామినేషన్ ప్రక్రియ ముగియడంతో ఇక ఆమె గెలుపు కోసం దృష్టిపెట్టారు. త్వరలో ఆమె అన్ని రాష్ట్రాల్లో పర్యటించి అధికార, విపక్ష పార్టీల మద్దతు కోరబోతున్నారు. ఏపీలో జూలై 4న ద్రౌపదీ ముర్ము పర్యటించబోతున్నారు. ఆమె పర్యటన వ్యవహారాల్ని కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్ పర్యవేక్షించనున్నారు. వీరిద్దరికీ ప్రధాని మోడీ ఆ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఎన్డీయేతో పాటు బీజేడీ, అన్నాడీఎంకే, వైసీపీ వంటి పార్టీల మద్ధతున్న ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికవడం లాంఛనంగానే కనిపిస్తోంది.