సజావుగా లేనంత వరకు ఇంతే: స్పీకర్, లోక్సభ సోమవారానికి వాయిదా
న్యూఢిల్లీ: లోకసభ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపాలని కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలు ఓవైపు, కావేరీ బోర్డు విషయమై అన్నాడీఎంకే మరోవైపు ఆందోళన చేపట్టాయి. దీంతో సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.
Recommended Video
సభలో గందరగోళం నేపథ్యంలో స్పీకర్ మాట్లాడుతూ.. తనకు అవిశ్వాసం నోటీసులు అందాయని స్పీకర్ చెప్పారు. కానీ సభ ఇలా ఉంటే ఎలా నడపనని, అవిశ్వాసంపై చర్చ ఎలా జరపగలనని ప్రశ్నించారు. సభ సజావుగా లేనంత వరకు చర్చ సాధ్యం కాదని చెప్పారు. స్పీకర్ తీరుపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే, తన పని తనను చేసుకోనిస్తే అవిశ్వాసంపై చర్చకు సిద్ధమని తెలిపారు. సభ సజావుగా లేకుంటే చర్చ ఎలా చేపట్టగలనని ప్రశ్నించారు.
కేంద్రమంత్రి అనంత్ కుమార్ మాట్లాడుతూ.. అవిశ్వాస తీర్మానంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కానీ సభను కాంగ్రెస్ గందరగోళపరుస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ తీరు అపహాస్యం చేసేలా ఉందని చెప్పారు. సభలో గందరగోళం సృష్టించడం సరికాదన్నారు.