ముగిసిన తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు: పశ్చిమబెంగాల్లో 79శాతం, అస్సాంలో 72శాతం
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత ఎన్నికల పోలింగి ముగిసింది. పశ్చిమబెంగాల్లో 30 నియోజకవర్గాల్లో జరిగిన ఈ ఎన్నికలు చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. రెండు రాష్ట్రాల్లో జరిగిన తొలి దశ అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా ఓటింగ్ శాతం నమోదైంది.
కరోనా నేపథ్యంలో మరో గంటపాటు పోలింగ్ సమయం పెంచడంతో సాయంత్రం 6 గంటల వరకు అనుమతించారు. అస్సాంలో 47 స్థానాల్లో ఎన్నికలు జరుగ్గా.. 72 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటలకు క్యూలైన్లలో వేచివున్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.
శనివారం సాయంత్రం 6 గంటలకు పశ్చిమబెంగాల్లో 79.79శాతం పోలింగ్ నమోదు కాగా, అస్సాంలో 72.14 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కావడంతో ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాగా, పశ్చిమబెంగాల్లోని పశ్చిమ మిడ్నాపూర్లో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సల్బోని పోలింగ్ బూత్ వద్ద సీపీఎం, బీజేపీ మద్దతుదారులు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దిరికి గాయాలయ్యాయి. మోహన్ పూర్ పోలింగ్ బూత్ వద్ద బీజేపీ, టీఎంసీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు లాఠీఛార్జీ చేసి వారిని చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. కాగా, పశ్చిమబెంగాల్లో 8 విడితల్లో, అసోంలో మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మే 2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.