నీట్ 2021 ఫలితాలు: తెలంగాణ విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్, ఏపీ విద్యార్థికి 5వ ర్యాంక్
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్-యూజీ 2021 ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. సుప్రీంకోర్టు గురువారం ఫలితాల వెల్లడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) సోమవారం రాత్రి నీట్ ఫలితాలు విడుదల చేసింది. సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన మరుసటి రోజో ఫైనల్ కీ, పరీక్ష ఫలితాలను విడుదల చేస్తారని భావించారు.
అయితే, నాలుగు రోజులైనా ఫలితాలు వెల్లడించకపోవడంపై సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో ఎన్టీఏ అధికారులు ఏకంగా ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలను http://neet.nta.nic.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
కాగా, ఈ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. తెలంగాణకు చెందిన మృణాల్ కుటేరి, ఢిల్లీకి చెందిన తన్మయ్గుప్తా, మహారాష్ట్రకు చెందిన కార్తిక్ నాయర్ మొదటి సాధించారు. సమాన మార్కులు వచ్చిన అందరికీ ఒకే ర్యాంకు ప్రకటించింది ఎన్టీఏ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు చెందిన రుషీల్ నీట్లో ఐదో ర్యాంకు సాధించాడు.
తెలంగాణకు చెందిన మరో విద్యార్థి ఖండవల్లి శశాంక్కు కూడా జాతీయ స్థాయిలో 5వ ర్యాంక్ వచ్చింది.. మహిళల టాప్ 20లో జాతీయ స్థాయిలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు కాస లహరి (30 వ ర్యాంక్), ఈమని శ్రీనిజ (38వ ర్యాంక్) సాధించారు. ఇక, పరీక్ష ఫైనల్ కీ, స్కోర్ కార్డులను కూడా వెబ్సైట్లో పెట్టింది ఎన్టీఏ. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన శరణ్యకు 60వ ర్యాంక్ సాధించారు.
ఇక, దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 12న ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది 16 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల విడుదలలో జాప్యం నెలకొనడంతో విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తం అయింది. ముంబైలోని ఓ పరీక్షా కేంద్రంలో ఇద్దరు విద్యార్థుల ఓఎంఆర్ షీట్లు తారుమారైనందున వారికి మళ్లీ పరీక్ష నిర్వహించాలని ముంబై హైకోర్టు ఆదేశించింది.
అంతవరకు ఫలితాల విడుదల నిలిపివేయాలంటూ స్పష్టం చేసింది. ముంబై హైకోర్టు తీర్పుపై ఎన్టీఏ అధికారులు సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. కేవలం ఇద్దరి కోసం 16లక్షల మంది విద్యార్థుల ఫలితాలు ఆపలేమని దేశ సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.
బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఆ ఇద్దరి విద్యార్థుల విషయాన్ని దీపావళి సెలవుల అనంతరం నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. దీంతో ఇప్పటికే సిద్ధం చేసిన నీట్ 2021 ఫలితాలను అధికారులు సోమవారం విడుదల చేశారు. నీట్ 2021 స్కోర్ ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, బీవీఎస్సీ, ఏహెచ్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.