NEET UG 2024 Results: నీట్ ఫలితాల్లో పెను సంచలనం-ఆ సిటీలో 4 వేల మందికి 600పైన మార్కులు..!
ఈ ఏడాది వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్దాయిలో నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. ఓవైపు సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరుగుతుండగానే నీట్ ఫలితాల సంచలనాలు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నగరాల వారీగా, పరీక్ష కేంద్రాల వారీగా విడుదల చేసిన ఫలితాల్లో రాజస్థాన్ లోని సికర్ నగరం రికార్డులు తిరగరాసింది.
నగరాల వారీగా, పరీక్ష కేంద్రాల వారీగా ప్రకటించిన నీట్ యూజీ ఫలితాల్లో రాజస్థాన్ లోని సికర్ నగరం రికార్డులన్నింటినీ తిరగరాసేసింది. జాతీయ సగటుతో పోలిస్తే ఏకంగా 575 శాతం ఎక్కువ సగటును నమోదు చేస్తూ అక్కడ పరీక్ష రాసిన అభ్యర్ధులందరూ ఏకంగా 600, 650 మార్కులు తెచ్చుకున్నారు. సికర్ నగరంలో ఉన్న ప్రతీ పరీక్ష కేంద్రంలో ఇలా భారీ సంఖ్యలో అభ్యర్ధులు 600 నుంచి 650కు పైగా మార్కులు సాధించినట్లు తాజా పరిశీలనలో తేలింది. దీంతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి.

రాజస్థాన్ లోని సికర్ నగరం ఈసారి గతంలో ఇదే రాష్ట్రంలోని నీట్ రికార్డుల కేంద్రం కోటాను కూడా దాటేసింది. సికర్ లో మొత్తం 50 నీట్ పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. వీటిలో టాగూర్ పరీక్ష కేంద్రంలో 356 విద్యార్ధులుంటే ఐదుగురు 750కి పైగా మార్కులు సాధించారు. 45 మందికి 650 మార్కులకు పైగా వచ్చాయి.
అంటే ఇక్కడ పరీక్ష రాసిన విద్యార్ధుల్లో 12.64 శాతం మంది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీటుకు అర్హత సాధించారు. ఈ విషయంలో జాతీయ స్థాయిలో సగటు కేవలం 1.3 శాతం మాత్రమే. సికర్ లోని 50 పరీక్ష కేంద్రాల్లో 42 జాతీయ స్ధాయిలో 57 టాప్ పరీక్షా కేంద్రాల్లో కూడా నిలిచాయి. తాజా ఫలితాలను బట్టి చూస్తే సికర్ లో పరీక్ష రాసిన అభ్యర్ధులు జాతీయ స్ధాయిలో ఏకంగా 6.8 శాతం ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లు సాధించబోతున్నారు.












Click it and Unblock the Notifications