మగవాళ్లూ ఆత్మహత్య చేసుకుంటారా?: మేనకా గాంధీ విస్మయం
న్యూఢిల్లీ: 'మగవాళ్లు కూడా ఆత్మహత్య చేసుకుంటారా? నేనెప్పుడూ వినలేదే'అంటూ విస్మయం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి మేనకా గాంధీ. ఫేస్బుక్ లైవ్ సెషన్లో ఒక ప్రశ్నకు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిగా మేనకా గాంధీ ఈ విధంగా సమాధానమిచ్చారు.
పురుషుల ఆత్మహత్యలను తగ్గించడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారన్నది ఆ ప్రశ్న. 'ఏ మగవాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు? ఆత్మహత్య చేసుకోవడం కంటే పరిస్థితులను ఎందుకు చక్కదిద్దుకోరు? ఒక్క ఆత్మహత్య కేసు గురించి అయినా నేనెప్పుడూ వినలేదు. చదవలేదు' అని మేనకా గాంధీ తెలిపారు.
గణాంకాలు మాత్రం మేనకా గాంధీ అభిప్రాయానికి విరుద్ధంగా ఉన్నాయి. నేషనల్ క్రైం రికార్డుల బ్యూరో ప్రకారం 2015లో 1,33,623 మంది ఆత్మహత్య చేసున్నారు. వీరిలో 91,528 మంది పురుషులు కాగా.. ఆ ఏడాది 42,088 మంది మహిళలు బలవన్మరణానికి పాల్పడ్డారు.
మెట్టెలు, గాజులు తీస్తేనే పరీక్ష రాయనిచ్చారు: మేనకా గాంధీ ఫిర్యాదు
ప్రభుత్వ ఉద్యోగ పరీక్ష రాయటానికి వెళ్లినపుడు తనను మెట్టెలు, గాజులతో పాటు అన్ని ఆభరణాలను తీసేయమన్నారంటూ ఒక మహిళ చేసిన ఫిర్యాదును పరిశీలించాలని కేంద్ర మంత్రి మేనకా గాంధీ.. మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్డీ) మంత్రిత్వశాఖను కోరారు.
జూన్ 25న జరిగిన ఢిల్లీ సబార్డినేట్ బోర్డు పరీక్షకు హాజరైనప్పుడు వివాహిత మహిళ చిహ్నాలైన మెట్టెలు, గాజులు.. చివరికి బొట్టు కూడా తొలగించాల్సి వచ్చిందంటూ ఢిల్లీకి చెందిన రీతూ వర్మ.. కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి మంత్రి మేనకా గాంధీకి లేఖ రాశారు. పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించాలంటే చేతి గాజులు పగలగొట్టుకోవాలని అక్కడి అధికారులు తనను ఆదేశించారని ఆమె పేర్కొన్నారు.
వివాహ చిహ్నాలన్నింటినీ పాఠశాల బయట పెట్టేసి రావాలని గట్టిగా చెప్పారన్నారు. కాగా, దీనిపై మేనకా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలా 'చిత్రమైన విషయం' అని వర్ణించారు. ఇలాంటి విషయాల్లో వ్యవహరించే తీరుపై ప్రామాణిక విధి విధానాలను రూపొందించాలంటూ మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాశ్ జవదేకర్కు లేఖ రాశారు.
'పరీక్షల్లో మోసాలను నివారించటానికి సంబంధించి ఈ సంవత్సరం పాఠశాల బోర్డు పరీక్షలకు ముందు చాలా కఠినమైన సూచనలు జారీచేసినట్టు కనబడుతోంది. శరీరమంతా వెతకటం, వస్త్రాలను తొలగించటం వంటి చర్యలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి' అని లేఖలో పేర్కొన్నారు. కొందరు పిల్లలు అత్యాధునిక పరికరాలతో కాపీ కొట్టటం నిజమే కావొచ్చు గానీ.. మోసాలను నివారించే నిబంధనలు వేధింపులకు దారితీయకూడదని మేనకా గాంధీ స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.