రాజకీయ పార్టీల్లో కొత్త అనుమానం.. వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై మరింత గందరగోళం
వీవీ ప్యాట్ల లెక్కింపు విషయంలో సుప్రీంకోర్టు తీర్పుతో రాజకీయ పార్టీలు కొంత ఊరట చెందాయి. అయితే పొలిటికల్ పార్టీల్లో ఇప్పుడు మరో కొత్త ఆందోళన మొదలైంది. తమ అనుమానాలు నివృత్తి చేయమంటూ ఎలక్షన్ కమిషన్ ను ఆశ్రయించినా అధికారులు చేతులెత్తేశారు. దీంతో ఈవీఎంలు, వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు విషయంలో మరింత గందరగోళం నెలకొంది.
వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై ఎన్నికల కమిషన్ కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
లెక్కల్లో తేడా వస్తే?
ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలతో పాటు ఒక్కో నియోజకవర్గంలో ఐదు వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంత వరకు బాగానే ఉన్నా ఒకవేళ ఈవీఎంలలో నమోదైన ఓట్లు, వీవీ ప్యాట్ల స్లిప్పుల లెక్కల్లో తేడా వస్తే ఏం చేయాలి? అలాంటి సందర్భాల్లో సమస్యను ఎలా పరిష్కరిస్తారన్నది అన్ని రాజకీయ పార్టీలలో నెలకొన్న సందేహం. ఈ విషయాన్ని నాయకులు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురాగా.. అధికారులు సైతం చేతులెత్తేశారు. ఈ అంశంపై తమకే స్పష్టతలేదని చెబుతున్నారు.
న్యాయపరమైన చిక్కులు
ఈవీఎంలలో ఓట్లు, వీవీ ప్యాట్ల స్లిప్పుల్లో తేడా వస్తే అవి న్యాయపరమైన ఇబ్బందులకు దారితీసే అవాకాశముందని నిపుణులు అంటున్నారు. ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ వీలైనంత తొందరగా మార్గదర్శకాలు రూపొందించాలని అంటున్నారు. వాటిపై రాజకీయపార్టీల సమ్మతిని తీసుకోవాలని అంటున్నారు. లేనిపక్షంలో పోలైన ఓట్లు, స్లిప్పుల లెక్కింపులో తేడాలపై రాజకీయ పార్టీలు న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశముందని అంటున్నారు.
చివరి రౌండ్ తర్వాత స్లిప్పుల లెక్కింపు
నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు చివరి రౌండ్ పూర్తైన తర్వాత వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కింపు మొదలుపెట్టాలని ఎన్నికల నిబంధనలు చెబుతున్నాయి. స్లిప్పుల లెక్కింపునకు ఏ కేంద్రాన్ని ఎంపిక చేయాలన్న విషయంలో ఈసీ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. నియోజకవర్గం పరిధిలోని అన్నిపోలింగ్ కేంద్రాల పేర్లను చీటీలపై రాసి డ్రా ద్వారా 5 కేంద్రాలను ఎంపిక చేయనున్నారు. ఈ ప్రక్రియంతా రిటర్నింగ్ అధికారి, పోటీలో ఉన్న అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల సమక్షంలో జరుగుతుంది.
స్లిప్పులు చివరలో లెక్కిస్తే గందరగోళం
వీవీ ప్యాట్ స్లిప్పులను చివరలో లెక్కించాలన్న ఈసీ నింబధనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది గందరగోళంతో పాటు గొడవలకు దారి తీసే అవకాశముందని కొందరు నాయకులు అంటున్నారు. నిజానికి ఎన్నికల ఫలితాలను అధికారులు రౌండ్లవారీగా ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలుస్తారన్నది చివరి రౌండ్ కన్నా ముందే తెలిసిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చివరలో వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించి అందులో తేడా వస్తే అది గందరగోళంతో పాటు గొడవలకు దారితీస్తే అవకాశం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈవీఎంలలో నమోదైన ఓట్లు, వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై స్పష్టతనిచ్చేలా మార్గదర్శకాలు జారీ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.