పాఠ్యాంశంగా యోగా, తప్పనిసరి: స్మృతి ఇరానీ
న్యూఢిల్లీ: అంతార్జాతీయ యోగా దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపిన మోడీ ప్రభుత్వం... ఇప్పుడు యోగాను తప్పనిసరి పాఠ్యాంశంగా చేయాలని నిర్ణయించింది. ఆరు నుంచి పదోతరగతి వరకు యోగాను పాఠ్యాంశంగా చేయడమే కాకుండా ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంలో కూడా చేర్చడానికి కేంద్రం ఆమోద ముద్రవేసింది.
కేంద్ర ప్రభుత్వ అధీనంలో కేంద్రీయ విద్యాలయాల్లోను, జవహర్ నవోదయ పాఠశాలలోనూ యోగా అనేది తప్పని సరి పాఠ్యాంశంగా చేసినట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. కేంద్రీయ విద్యాలయాలలో ఆరు నుంచి పది తరగతులు చదివే విద్యార్థులందరికీ ఇక యోగా బోధన తప్పని సరి చేయనున్నట్లు సోమవారం ఇక్కడ చెప్పారు.
అలాగే వచ్చే ఏడాది ఢిల్లీలో జాతీయ స్థాయిలో విద్యార్థులకు యోగా పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పోటీలలో అత్యుత్తమంగా యోగా చేసిన విద్యార్థికి 5లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు స్మృతి ఇరానీ వెల్లడించారు.
యోగాను పాఠ్యాంశంగా చేసుకోవాలా వద్దా అన్న విషయంలో ఆయా రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చామని స్మృతి పేర్కొన్నారు. విద్యార్థలపై యోగా బోధన పెద్దగా బరువు మోపదని వివరించిన ఆమె ఈ పాఠ్యాంశంలో 80 మార్కులు ప్రాక్టికల్స్ కు రిజర్వ్ చేస్తామన్నారు. అయితే పూర్తి శ్రద్ధతో విద్యార్థులు ప్రాక్టికల్స్ కు హాజరవుతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.