జయలలిత మృతిపై వెలుగులోకి కొత్త విషయం.. ఆర్ముగస్వామి కమిషన్ ముందు డాక్టర్లు ఏం చెప్పారంటే
తమిళనాడు మాజీ సీఎం జయలలిత మృతిపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమిళనాడు మాజీ సీఎం జయలలిత 2016 శాసనసభ ఎన్నికల్లో గెలిచి వరుసగా రెండో సారి సీఎం పదవి చేపట్టక ముందే తీవ్ర అస్వస్థతకు గురయ్యారని అపోలో ఆసుపత్రి డాక్టర్ బాబు మోహన్ జస్టిస్ ఆర్ముగ స్వామి కమిషన్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. అప్పటికే ఆమె ఇతరుల సహాయం లేకుండా నడవలేని స్థితిలో ఉన్నారని వైద్యులు చెప్పారు.
రెండేళ్ళ విరామం తర్వాత మళ్ళీ మొదలైన జయలలిత మృతి కేసు విచారణ
రెండేళ్ళ విరామం తరువాత జయలలిత మృతి కేసుపై జస్టిస్ ఆర్ముగ స్వామి కమిషన్ విచారణ సోమవారం నాడు ప్రారంభమైంది. ఈ విచారణకు ఐదుగురు డాక్టర్లు హాజరయ్యారు. వారు జయలలిత మృతికి సంబంధించి, ఆమె అనారోగ్య పరిస్థితులకు సంబంధించిన కీలక విషయాలను కమీషన్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఈ వాంగ్మూలంలో జయలలిత ఏం పదవి చేపట్టక ముందే తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారని, తరచూ స్పృహ కోల్పోయి మూర్ఛ పోయే వారిని వారు పేర్కొన్నట్టు సమాచారం.
జయలలిత రెండో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టక ముందే నడవలేని స్థితిలో ఉన్నారన్న వైద్యుడు
సిరుదావూరు బంగ్లా లేదా కొడనాడు ఎస్టేట్లో విశ్రాంతి తీసుకోవాలని తాను సలహా ఇచ్చినట్లుగా తెలిపారు. ప్రతిరోజూ రోజుకు 16 గంటలు పని చేసే తాను పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం సాధ్యం కాదని జయలలిత చెప్పారని వైద్యులు వెల్లడించారు. జయలలిత రెండోసారి సీఎం బాధ్యతలు స్వీకరించడానికి ముందురోజు ఆమె వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ శివ కుమార్ పిలుపుమేరకు పోయెస్ గార్డెన్ కు వెళ్లానని, అప్పటికే ఆమె ఒంటరిగా నడిచి పరిస్థితిలో లేరని, తీవ్ర అస్వస్థతతో ఉన్నారని వైద్యులు తెలిపారు.
జయలలిత మృతి కేసు.. అనుమానాలపై విచారణ
జయలలిత 2016 సెప్టెంబర్ 22వ తేదీన రాత్రి తీవ్ర అస్వస్థతకు గురై చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరి 75 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొంది, డిసెంబర్ 5వ తేదీన తుదిశ్వాస విడిచారు. అధికారంలో ఉండగా మరణించిన భారతదేశ మొదటి మహిళా ముఖ్యమంత్రి ఆమె. తమిళనాడు ప్రభుత్వం ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత మరణానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు చేసేందుకు జస్టిస్ ఏ ఆర్ముగ స్వామి నేతృత్వంలో కమిషన్ను నియమించింది. ఆమె 75 రోజులు ఆసుపత్రిలో ఉండి ఆపై తుది శ్వాస విడిచారు.
Recommended Video
జస్టిస్ ఎ ఆర్ముగ స్వామి కమిషన్కు సహాయం చేసేందుకు మెడికల్ బోర్డ్ ఏర్పాటుకు సుప్రీం ఆదేశం
ఆమె మరణానికి కారణాలపై అప్పట్లో చాలా ఊహాగానాలు వచ్చాయి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు వైద్యులతో కూడిన ప్యానెల్ను నామినేట్ చేయాలని మరియు విచారణకు నాయకత్వం వహిస్తున్న జస్టిస్ ఎ ఆర్ముగ స్వామి కమిషన్కు సహాయం చేయడానికి మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇదిలావుండగా, బహిష్కరించబడిన అన్నాడీఎంకే సభ్యుడు టీటీవీ దినకరన్ ఈ అంశంపై స్పందిస్తూ, జయలలిత అనారోగ్యంతో ఉన్నారని, ఆ తర్వాత తన అత్త వి శశికళను లక్ష్యంగా చేసుకుని ఆమె మరణాన్ని రాజకీయం చేశారని పేర్కొన్నారు.