7వ రౌండ్ చర్చలు కూడా ఫెయిల్ -అగ్రి చట్టాలపై రైతులు, కేంద్రం మొండిపట్టు -8న మళ్లీ భేటీ
వివాదాస్పద వ్యవసాయ చట్టాల విషయంలో రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చల్లో మళ్లీ ప్రతిష్టంభన ఏర్పడింది. ఢిల్లీ సరిహద్దులో రైతుల నిరసనలు 40వ రోజుకు చేరినవేళ సోమవారం రైతు సంఘాల నేతలు, కేంద్ర మంత్రులు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ వేదికగా 7వ రౌండ్ చర్చలు జరిగాయి. సమస్య పరిష్కారం కోసం జరిగిన ఆరు దఫాల చర్చలు విఫలం కాగా, ఇవాళ్టి 7వ రౌండ్ కూడా కొలిక్కి రాకుండానే అసంపూర్తిగా ముగిశాయి.
Recommended Video
వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని పట్టుపడుతోన్న రైతులు.. తమ డిమాండ్లపై వెనక్కి తగ్గబోమని, కేంద్రం గనుక తమ ప్రతిపాదనలను కాదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించగా.. ఇవాళ్టి చర్చల్లో కేంద్ర మంత్రులు మరోసారి రైతులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ ప్రతిపాదననే అంగీకరించాలని మంత్రులు చెప్పడంతో రైతు సంఘాల నేతలు నిరాకరించారు.
ప్రతిపాదనలు, డిమాండ్ల విషయంలో ఇరు పక్షాలూ ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ఏడో రౌండ్ చర్చల్లోనూ ప్రతిష్టంభన ఏర్పడింది. దీంతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. అయితే, ఈ నెల 8న(శుక్రవారం) మరోసారి కూర్చొని మాట్లాడుకోవాలని ఇరు పక్షాలు అంగీకరించాయి. 7వ రౌండ్ చర్చలు ఫెయిలైతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్న రైతులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు..
రైతుల ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈనెల 6న ట్రాక్టర్ల ర్యాలీ, 13న సాగు చట్టాల ప్రతులను దహనం, జనవరి 23న నేతాజీ జయంతిని పురస్కరించుకుని ఆజాద్ హింద్ కిసాన్ దివస్, గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలోని రాజ్పథ్లో ట్రాక్టర్లతో గణతంత్ర పరేడ్, రైతు కవాతు నిర్వహిస్తామని రైతు సంఘాల నేతలు ప్రకటించారు.