అర్నాబ్ గోస్వామిపై మరో కొత్త కేసు: మహిళ అధికారిని వేధించారంటూ ఫిర్యాదు
ముంబై: రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామి, మరో ఇద్దరిపై బుధవారం సాయంత్రం పోలీసులు కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అరెస్టును అడ్డుకోవడం, మహిళా పోలీసు అధికారిపై దౌర్జన్యానికి దిగారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు.
అర్నాబ్ గోస్వామి, ఇతరులపై సెక్షన్ 353 (ప్రభుత్వ సర్వంట్ తన విధిని నిర్వర్తించకుండా నిరోధించడానికి దాడి లేదా క్రిమినల్ ఫోర్స్), 504 (శాంతి ఉల్లంఘనను రేకెత్తించడానికి ఉద్దేశపూర్వకంగా అవమానించడం), భారత శిక్షాస్మృతి 506 (క్రిమినల్ బెదిరింపు) కింద కేసు నమోదైంది. ముంబైకి చెందిన ఎన్ఎం జోషి మార్గ్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది.
2018లో 5 ఏళ్ల ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్, అతని తల్లి కుముద్ నాయక్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి ఆత్మహత్యకు అర్నాబ్ గోస్వామే కారణంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అర్నాబ్ గోస్వామిని ముంబై నివాసం నుంచి రాయ్గడ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
బుధవారం ఉదయం అలీబాగ్ పోలీసు బృందం ముంబైలోని తన నివాసానికి చేరుకున్నప్పుడు అర్నాబ్ గోస్వామి ఒక మహిళా పోలీసు అధికారిపై దాడి చేశాడని వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది. ముంబైలోని లోయర్ పరేల్ నివాసం నుంచి అర్నాబ్ గోస్వామిని అరెస్టు చేసిన బృందంలో భాగమైన మహిళా పోలీసు అధికారి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
పోలీసు వ్యాన్ లోకి నెట్టివేయబడిన అర్నాబ్ గోస్వామి.. తన ఇంటి వద్ద తనను తీసుకెళ్లేముందు తనపై పోలీసులు దాడి చేశారని పేర్కొన్నారు.
ఇది ఇలావుండగా, రిపబ్లిక్ టీవీ ముంబై, రాయ్గడ్ పోలీసులకు వ్యతిరేకంగా మానవ హక్కులను ఆశ్రయించింది. అర్నాబ్ గోస్వామిపై పోలీసులు దాడి చేశారని, చట్ట విరుద్ధంగా వ్యవహరించారని జాతీయ మానవ హక్కుల సంఘంతోపాటు మహారాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది.
తాజాగా, అర్నాబ్ గోస్వామి భార్య, కుమారుడిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. తమ విధులకు భంగం కలిగించారని, పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు.